కరోనా : సంక్షోభంలో చైనా గేమ్ ప్లాన్..? అది భారత్కు ముప్పేనా..?
అంతా సవ్యంగా ఉండి ఉంటే ఈ ఏడాది మార్చి నెలలో భారత్లో 5జీ ట్రయల్స్ మొదలయ్యేవి. కానీ కరోనా వైరస్ ప్రభావంతో ఆ ప్రాజెక్ట్ తాత్కాలికంగా నిలిచిపోయింది. 5జీ ట్రయల్స్ కోసం చైనాకు చెందిన ప్రముఖ సెల్ఫోన్ తయారీ సంస్థ హువాయ్కి కూడా భారత్ అనుమతినిచ్చింది. అమెరికాతో వాణిజ్యపరమైన వివాదాలు నెలకొన్న వేళ.. భారత్ చైనా కంపెనీకి అనుమతులివ్వడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. తాజాగా ప్రపంచానికి కరోనా వైరస్ను అంటించిందన్న విమర్శలు మోస్తున్న వేళ.. చైనా కంపెనీకి భారత్ అనుమతులు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. భారత్లో 5జీ ట్రయల్స్కు హువాయ్ కంపెనీని దూరం పెట్టాలని ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ స్వదేశీ జాగరణ్ మంచ్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.
Recommended Video

చైనా గేమ్ ప్లాన్..? స్వదేశీ జాగరణ్ ఆరోపణలు
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో నియంత్రణ చర్యలకు అవసరమైన మెడికల్ సామాగ్రి కోసం చాలా దేశాలు చైనాపై ఆధారపడ్డాయి. అయితే దీన్నే అదనుగా భావించిన చైనా.. హువాయ్ కంపెనీ సేవలు,ఉత్పత్తులను అనుమతిస్తేనే మెడికల్ సామాగ్రిని సప్లై చేస్తామని ఫ్రాన్స్ వంటి దేశాలకు మెలిక పెడుతోంది. ఇదే విషయాన్ని స్వదేశీ జాగరణ్ మంచ్ జాతీయ కో-కన్వీనర్ అశ్విని మహాజన్ ప్రస్తావించారు. ఇలాంటి సంక్షోభ సమయంలో చైనా అత్యంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఇప్పటికే పలు దేశాలకు లోపాలతో కూడిన కోవిడ్ 19 కిట్స్ సరఫరా చేసి తన బుద్దిని బయటపెట్టుకుందన్నారు. అది గాక ఇప్పుడు.. మెడికల్ సామాగ్రి కావాలంటే హువాయ్ సంస్థను అనుమతించాల్సిందేనని మెలిక పెట్టడం బ్లాక్మెయిలింగ్ చేయడమేనని విమర్శించారు. ఇది చైనా గేమ్ ప్లాన్ అని.. కాబట్టి భారత్లో 5జీ ట్రయల్స్కు హువాయ్ని అనుమతించడంపై మోదీ ప్రభుత్వం పునరాలోచించాలచి సూచించారు.

జాతీయ భద్రతకు ముప్పు..?
ఈ మేరకు ఏప్రిల్ 5న అశ్విని మహాజన్ ట్విట్టర్లో ఓ ట్వీట్ పోస్ట్ చేశారు. అందులో కేంద్ర టెలికాం మంత్రి రవిశంకర్ ప్రసాద్ను ట్యాగ్ చేసి హువాయ్ కంపెనీకి అనుమతులపై పునరాలోచన చేయాలని కోరారు. అమెరికా,ఆస్ట్రేలియా లాంటి దేశాలు హువాయ్తో నేషనల్ సెక్యూరిటీకి ముప్పు ఉందని ఆ సంస్థను బ్లాక్ చేశాయని గుర్తుచేశారు. కాబట్టి భారత జాతీయ భద్రతను కూడా దృష్టిలో ఉంచుకుని హువాయ్ అనుమతులను రద్దు చేయాలని కోరారు. 'మొదట వాళ్లు కరోనా వైరస్ సమాచారాన్ని దాచిపెట్టి ప్రపంచానికి ముప్పు తీసుకొచ్చారు. ఆ తర్వాత లోపభూయిష్టమైన లక్షలాది కిట్స్ను సప్లై చేస్తూ పలు దేశాలను రిస్క్లో పెడుతున్నారు. ఇక ఇప్పుడు పీపీఈ,టెస్ట్ కిట్స్ కావాలంటే హువాయ్ సంస్థకు 5జీ ట్రయల్స్ అనుమతులు ఇవ్వాలని మెలిక పెడుతున్నారు. భారత్కు ఇంకా సమయం ఉంది.. దేశ జాతీయ భద్రతా సమాచారం చోరీ అవకముందే దీనిపై ఒక నిర్ణయానికి రావాలి.' అని విజ్ఞప్తి చేశారు.
ఒప్పందం రద్దు చేసుకున్న బ్రిటన్..!
బ్రిటన్ హువాయ్ ఒప్పందాన్ని రద్దు చేసుకుందని సోమవారం(ఏప్రిల్ 6) మహాజన్ తన ట్విట్టర్లో పేర్కొన్నారు. కరోనా వైరస్తో కూడిన టెస్టింగ్ కిట్స్ను పంపించినందుకు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. చైనాకు చెందిన హువాయ్ కంపెనీతో 5జీ ఒప్పందాన్ని బ్రిటన్ ప్రధాని బోరిస్ రద్దు చేసుకున్నారని తెలిపారు. భారత్లోనూ హువాయ్ సేవలపై తాము మొదటి నుంచి అనుమానం వ్యక్తం చేస్తున్నామని.. భద్రతాపరంగా సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అన్నారు. అమెరికా,ఆస్ట్రేలియా లాంటి దేశాలే ఆ సంస్థను నిషేధించినప్పుడు భారత్ మాత్రం ఎందుకు స్వాగతించాలని ప్రశ్నించారు.

లోపభూయిష్టమైన కిట్లను చైనాకు తిప్పి పంపుతున్న దేశాలు
ఇలాంటి సంక్షోభ సమయాన్ని కూడా లాభాలు గడించేందుకు ఉపయోగించుకోవాలని చైనా భావిస్తోందని మహాజన్ ఆరోపించారు. పేరుకు మాత్రం ప్రపంచ దేశాలకు ఏదో సాయం అందిస్తున్నట్టు చెబుతోందని.. కానీ చైనా ఇప్పటికీ వ్యాపార దృక్పథంతోనే వ్వవహరిస్తోందని మండిపడ్డారు. కరోనా బూచిని చూపెట్టి ఇతర దేశాల చేతులు మెలిపెట్టే పనిచేస్తోందని విమర్శించారు. కాబట్టి భారత్కు చైనా నుంచి ఎటువంటి సామాగ్రిని దిగుమతి చేయవద్దని ప్రధాని నరేంద్ర మోదీని మహాజన్ కోరారు. పీపీఈ,టెస్టింగ్ కిట్స్,వెంటిలేటర్స్.. వేటినీ నమ్మడానికి అవకాశం లేదన్నారు.కాగా,చైనా సప్లై చేస్తున్న మెడికల్ సామాగ్రిపై చాలా దేశాల నుంచి విమర్శలు వస్తున్నాయి. స్పెయిన్ ఇప్పటికే 6కోట్ల టెస్టింగ్ కిట్లను చైనాకు వాపస్ పంపిస్తున్నట్టు ప్రకటించింది. చైనా పంపించిన ఆ కిట్స్ కేవలం 30శాతం డిటెక్షన్ రేటును మాత్రమే కలిగి ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. టర్కీ,నెదర్లాండ్,సీజెక్ రిపబ్లిక్ లాంటి దేశాలు కూడా మాస్కులు ఇతరత్రా కిట్లను చైనాకు వాపస్ పంపించాలని నిర్ణయించాయి.












Click it and Unblock the Notifications