రావణుడు కమ్మరి పని చేసేవాడా?..అసలు ఆదిపురుష్ ఎవరి కోసం తీశారు?
ముంబై: యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ.. ఆదిపురుష్. రామాయణాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిన ఈ మూవీ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో ఒకేసారి విడుదలయింది. మిక్స్డ్ టాక్ను సొంతం చేసుకుంది ఈ సినిమా. నాసిరకం గ్రాఫిక్స్ వాడటం వల్ల రామాయణాన్ని చూస్తోన్న ఫీలింగ్ కలగట్లేదని చెప్పినవారూ లేకపోలేదు.
ప్రత్యేకించి- లంకలో రావణుడి ముందు హనుమంతుడు చెప్పే డైలాగులు తీవ్ర విమర్శల బారిన పడ్డ విషయం తెలిసిందే. గుడ్డ నీ బాబుది, తైలం నీ బాబుది, కాలేది కూడా నీ బాబుదే అంటూ హనుమంతుడు చెప్పే డైలాగ్.. విమర్శల సునామీని ఎదుర్కొంది. రామయణ స్ఫూర్తిని దెబ్బతీసిందంటూ సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు.

దీనితో ఆదిపురుష్ యూనిట్ వెనక్కి తగ్గింది. ఆ డైలాగులను మార్చాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు ఆదిపురుష్ మాటల రచయిత మనోజ్ మున్తాషిర్ శుక్లా ఓ ప్రకటన విడుదల చేశారు. తన అధికారిక ట్విట్టర్ అకౌంట్లో దీనిపై సుదీర్ఘమైన వివరణ ఇచ్చారు. వివాదాస్పద డైలాగులను సవరించదలచనున్నట్లు వెల్లడించారు. తనను సనాతన ద్రోహిగా ఆరోపించడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు.
అయినప్పటికీ- ఆదిపురుష్ సినిమాపై చెలరేగిన విమర్శల దాడి తగ్గట్లేదు. దాని తీవ్రత మరింత పెరుగుతోనే వస్తోంది. తాజాగా ప్రముఖ టీవీ నటుడు సునీల్ లాహ్రీ దీనిపై స్పందించారు. ఆదిపురుష్ మూవీపై ఘాటు విమర్శలు చేశారు. సునీల్ లాహ్రీ మరెవరో కాదు. కోట్లాదిమందిని ఉర్రూతలూగించిన టీవీ రామాయణంలో లక్ష్మణుడి పాత్రధారి. టీవీ రామాయణానికి రామానంద్ సాగర్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.

ఆదిపురుష్లో పాత్రల తీరుతెన్నులను సునీల్ లాహ్రీ తప్పుపట్టారు. వాటి చిత్రీకరణపై అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. తనకు ఏ మాత్రం ఈ సినిమా నచ్చలేదని తేల్చి చెప్పారు. వీధుల్లో మాట్లాడుకునే డైలాగులను హనుమంతుడి పాత్రధారి వెంట పలికించారంటూ మండిపడ్డారు. ఒక సన్నివేశంలో రావణుడు ఇనుమును కొడుతున్నట్లుగా చూపించారని, అది ఎంత మాత్రం సహేతుకం కాదని పేర్కొన్నారు.

రావణుడేమైనా కమ్మరి పనులు చేసుకునేవాడా? అంటూ సునీల్ లాహ్రీ ప్రశ్నించారు. ఆదిపురుష్ సినిమాను ఎవరి కోసం తీశారో అర్థం కావట్లేదని వ్యాఖ్యానించారు. అందులోని పాత్ర ధారుల చిత్రీకరణ.. రామాయణ స్ఫూర్తిని దెబ్బతీసేలా ఉందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చిత్రాన్ని తాను ప్రోత్సహించలేనని స్పష్టం చేశారాయన. ఒక్క శాతం కూడా ఈ సినిమాను మెజారిటీ ప్రజలకు నచ్చేలా తీయలేదని చెప్పారు.












Click it and Unblock the Notifications