మోడీ పొలిటికల్ సర్జికల్ స్ట్రైక్: కేబినెట్లో తెలుగింటి ఆడపడచు?
బెంగళూరు: ప్రధానమంత్రికా వరుసగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్న నరేంద్ర మోడీ మరో సర్జికల్ స్ట్రైక్ను ప్రకటించారా? పొలిటికల్ సర్జికల్ స్ట్రైక్ చేస్తున్నారా? ప్రతిపక్షాలకు ఊపిరాడకుండా చేస్తున్నారా? అవుననే అనిపిస్తోంది. ఈ సారి కేంద్ర కేబినెట్లో కొన్ని కొత్త ముఖాలకు ఆయన చోటివ్వడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రత్యేకించి- దక్షిణాది నుంచి ఎంపిక చేసుకున్న నేతల్లో కొందరికి కేబినెట్లో బెర్త్ కల్పించడం ద్వారా తటస్థులను ఎన్డీఏ వైపు మొగ్గు చూపించే వ్యూహాన్ని ఆయన అనుసరిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
చంద్రబాబు మరో యూటర్న్? బీజేపీకి దగ్గరయ్యే ప్రయత్నం? కేశినేని నానితో రాయబారం?
ఇందులో భాగంగా- కర్ణాటక నుంచి ఏకైక స్వతంత్ర అభ్యర్థిగా లోక్సభకు ఎన్నికైన తెలుగింటి ఆడపడుచు, కన్నడికుల కోడలు, ప్రముఖ నటి సుమలతను కేబినెట్లో తీసుకోవచ్చనే ఊహాగానాలు చెలరేగుతున్నాయి. దీనికి అనుగుణంగా ఆమె సాయంత్రానికి ఢిల్లీ వెళ్లొచ్చనే వార్తలు గుప్పుమంటున్నాయి. కేంద్ర కేబినెట్లో సహాయ మంత్రి పదవిని కట్టబెట్ట వచ్చనే ప్రచారం కర్ణాటకలో ఊపందుకుంది.
బీజేపీ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా..
మొన్నటి లోక్సభ ఎన్నికల్లో సుమలత కర్ణాటకలోని మండ్య నుంచి గెలుపొందారు. తన సమీప ప్రత్యర్థి, జనతాదళ్ (సెక్యులర్) అభ్యర్థి, కన్నడ స్టార్ హీరో నిఖిల్ గౌడను ఆమె ఓడించారు. భారతీయ జనతాపార్టీ మద్దతుతో ఆమె స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. లక్షా 20 వేల ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. సుమలత గెలవాలనే ఉద్దేశంతో బీజేపీ మండ్య నియోజవర్గంలో తమ అభ్యర్థిని నిలబెట్టలేదు. దీనితో బీజేపీ క్యాడర్ మొత్తం సుమలతకు మద్దతు పలికింది. ఆమె విజయ కోసం పని చేసింది.
సుమలతను కాదని..ఓటమిని కొని తెచ్చకున్న జేడీఎస్
నిఖిల్ గౌడ కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు. అయినప్పటికీ- సుమలత గెలుపును అడ్డుకోలేకపోయారు. నిజానికి- మండ్య లోక్సభ స్థానం జేడీఎస్కు కంచుకోట. పొత్తుల కారణంగా ఈ స్థానాన్ని తమకు ఇవ్వాలని కాంగ్రెస్ పట్టుబట్టింది. కాంగ్రెస్ తరఫున సుమలత ఇదే స్థానం నుంచి పోటీ చేయాల్సింది. ఆమెకు టికెట్ కూడా ఖాయం చేసింది కాంగ్రెస్. అక్కడే పొత్తు, సీట్ల సర్దుబాటు బెడిసి కొట్టింది. సుమలతకు కాంగ్రెస్ టికెట్ ఇవ్వడానికి సిద్ధం కావడానికి కారణం ఉంది.
సేఫ్ సీటుగా భావించినా..బెడిసి కొట్టింది..
ఆమె భర్త, దివంగత అంబరీష్ కాంగ్రెస్ నాయకుడు. యూపీఏ-2లో ఆయన మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని కేబినెట్లో సహాయ మంత్రిగా పనిచేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. ఆయన మరణానంతరం సుమలతను రాజకీయాల్లోకి తీసుకుని వచ్చిందే కాంగ్రెస్. అంబరీష్ సొంత జిల్లా మండ్య. గతంలో ఆయన ఇదే నియోజకవర్గం నుంచి లోక్సభ, శాసనసభలకు కాంగ్రెస్ తరఫున గెలిచారు. కాంగ్రెస్కు మండ్య నియోజకవర్గాన్ని వదలుకోవడానికి జేడీఎస్ ఏ మాత్రం ఇష్ట పడలేదు. సేఫ్ సీటు కావడం వల్ల తన కుమారుడి రాజకీయ అరంగేట్రానికి మండ్య ఉపకరిస్తుందనే ఉద్దేశంతో కుమారస్వామి..తన కుమారుడిని పోటీకి దింపారు.
చంద్రబాబు ప్రచారం చేసినా గెలవలేని నిఖిల్..
కాంగ్రెస్ నుంచి తనకు టికెట్ దక్కకపోవడంతో సుమలత స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగారు. బీజేపీ మద్దతుతో ఘన విజయం సాధించారు. సుమలతను ఓడించాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా రంగంలోకి దిగారు. మండ్యలో రెండుచోట్ల ప్రచార సభల్లో పాల్గొన్నారు. జేడీఎస్ అభ్యర్థి నిఖిల్ గౌడను గెలిపించాలని కోరారు. అయినప్పటికీ.. ఓటమి కోరల నుంచి తప్పించుకోలేకపోయారు నిఖిల్ గౌడ.
దక్షిణ కర్ణాటకపై పట్టు కోసం..
సుమలతకు కేబినెట్లో బెర్త్ కల్పించడం ద్వారా కర్ణాటకలో పార్టీ మరింత బలపడుతుందనేది బీజేపీ నేతల అంచనా. దీనికితోడు- సుమలత తెలుగింటి ఆడపడుచు కావడం వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో చెప్పుకోవడానికి, ప్రచారానికైనా ఉపయోగపడుతుందని బీజేపీ నాయకులు భావిస్తున్నారు. ఆమెకు కేబినెట్లో చోటు దక్కిందా? లేదా? అనేది మరికొన్ని గంటల్లో స్పష్టం కానుంది. నిజానికి కర్ణాటకలో బీజేపీ బలంగా ఉంది. క్షేత్ర స్థాయిలో ఆ పార్టీకి బలమైన క్యాడర్ ఉంది. కర్ణాటకలో మొత్తం 28 లోక్సభ స్థానాలు ఉండగా.. మొన్నటి లోక్సభ ఎన్నికల్లో 25 చోట్ల బీజేపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. సుమలతను కూడా బీజేపీ ఖాతాలోకే వేస్తే.. ఈ సంఖ్య 26కు చేరుతుంది. కాంగ్రెస్, జనతాదళ్ (సెక్యులర్) ఒక్కొక్క స్థానంలో విజయం సాధించాయి. కర్ణాటక దక్షిణ ప్రాంతాల్లోని హసన్, మండ్య, మైసూరు జిల్లాల్లో బీజేపీ ప్రభావం చాలా తక్కువ. ఇక్కడ జనతాదళ్ (సెక్యులర్)కు గట్టి పట్టు ఉంది. ఆయా జిల్లాల్లో జేడీఎస్ ప్రాబల్యాన్ని అడ్డుకోవడంలో భాగంగా- సుమలతకు కేంద్ర కేబినెట్లో చోటు కల్పించాలని బీజేపీ అధిష్ఠానం భావిస్తోంది.