ఐసిస్ ట్విట్టర్ కేసు దర్యాప్తు చేస్తున్న ఐపీఎస్ల బదిలీలు
బెంగళూరు: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులకు అనుకూలంగా ట్విట్టర్ నిర్వహిస్తున్నాడని, వారి రక్తపాత దృశ్యాలు ఇతరులకు షేర్ చేస్తున్నాడని ఆరోపిస్తూ బెంగళూరు పోలీసులు అరెస్టు చేసిన మెహ్ది కేసు దర్యాప్తు కుంటుపడుతున్నది. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సీనియర్ ఐపీఎస్ అధికారులు ఒక్కక్కరు బదిలి అవుతుండటంతో కేసు నీరు కారిపోయేటట్లు ఉందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
మెహ్దిని అరెస్టు చెయ్యడంలో కీలకపాత్ర పోషించి కేసు దర్యాప్తు వేగవంతం చేసిన బెంగళూరు సీసీబీ విభాగం డీసీపీ అభిషేక్ ఘోయల్ను రాష్ట్ర ప్రభుత్వం బదలీ చేసింది. అభిషేక్ ఘోయల్ను సీఏఆర్ విభాగానికి బదిలి చేశారు. అభిషేక్ ఘోయల్ స్థానంలో డీసీపీ రమేష్ను నియమించారు.
మెహ్ది ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులకు అనుకూలంగా ట్విట్టర్ నిర్వహిస్తున్నాడని అభిషేక్ ఘోయల్ గుర్తించారు. మెహ్దిని పట్టుకునే సమయంలో ఆయన స్వయంగా సంఘటనా స్థలంలో ఉన్నారు. మెహ్ది ట్విట్ చేసిన వారిలో పేరు పోందిన ప్రముఖల కుమారులు, రాజకీయ నాయకుల కుమారులు ఉన్నారని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి.
తరువాత మెహ్దిని వదిలి వెయ్యాలని తీవ్రస్థాయిలో అప్పటి బెంగళూరు నగర అడిషనల్ పోలీసు కమిషనర్ (సీసీబీ), హేమంత్ నింభార్కర్, డీసీపీ అభిషేక్ ఘోయల్ మీద ఒత్తిడి వచ్చిందని ఆరోపణలు ఉన్నాయి. అయితే వీరిద్దరు ససేమిరా అన్నారు. మెహ్ది పుట్టు పూర్వత్తరాలు బయటకు తీశారు.
కేసు దర్యాప్తు వేగవంతం చేశారు. రెండు నెలల క్రితం హేమంత్ నింభార్కర్ను బెంగళూరు సీసీబీ విభాగం అడిషనల్ పోలీసు కమిషనర్ బాద్యతల నుండి తప్పించి వేరే చోటకి బదిలీ చేశారు. తర్వాత డీసీపీ అభిషేక్ ఘోయల్ కేసు దర్యాప్తు వేగవంతం చేశారు. సరైన సమయంలో (90 రోజుల లోపు) కోర్టులో చార్జీషీటు సమర్పించడంలో పోలీసులు విఫలం అయ్యారని మెహ్ది తరఫున న్యాయవాది కోర్టులో పిటిషన్ వేశారు. తన క్లయింట్కు బెయిల్ మంజూరు చెయ్యాలని న్యాయస్థానంలో మెహ్ది న్యాయవాది విజ్ఞప్తి చేశారు.
డీసీపీ అభిషేక్ ఘోయల్ ఛార్జిషీట్ తయారు చేసి న్యాయస్థానంలో సమర్పించడానికి సిద్దం అయ్యారు. మెహ్ది ఐసిస్కు మద్దతు ఇస్తూ తమకు ట్విట్ చేశాడని, మమల్ని రెచ్చగోట్టి ఐసిస్లో చేరాలని ఒత్తిడి చేశాడని ఇద్దరు యువకులు ఇటీవలే పోలీసుల ఎదుట సాక్ష్యం చెప్పారు. న్యాయమూర్తి ముందు వారిద్దరి వాగ్మూలం రికార్డు చేశారు.
ఈ సమయంలో అభిషేక్ ఘోయల్ను ఎలాంటి పని లేని సీఏఆర్ విభాగానికి బదిలి చేస్తు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు బాధ్యతలు స్వీకరించిన డీసీపీ రమేష్ మెహ్దిని ఎందుకు అరెస్టు చేశారు, అసలు ఏమి జరిగింది అని కేసు పూర్తి వివరాలు అధ్యయనం చేసి న్యాయస్థానంలో ఎఫ్ఐఆర్ సమర్పించ వలసి ఉంటుంది. అందుకు చాల సమయం పట్టే అవకాశం ఉంది. అంతలో మెహ్దికి న్యాయస్థానంలో బెయిల్ మంజూరు అయితే కేసు దర్యాప్తు నీరు కారిపోయే అవకాశం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి.
మెహ్ది కేసు దర్యాప్తు పూర్తి కావచ్చిందని, న్యాయస్థానంలో ఎఫ్ఐఆర్ సమర్పించే సమయంలో డీసీపీ అభిషేక్ ఘోయల్ను బదిలి చెయ్యడం సరికాదని సీనియర్ ఐపీఎస్ అధికారులు అంటున్నారు. భారత్ ప్రభుత్వం నిషేదించిన ఇండియన్ ముజాహుద్దిన్ (ఐఎం) ఉగ్రవాదులతో సంబంధాలు పెట్టుకుని గుట్టు చప్పుడు కాకుండా సంచరిస్తున్న నలుగురు అనుమానిత ఉగ్రవాదులను మంగళూరు సమీపంలోని భత్కల్లో అభిషేక్ ఘోయల్ అరెస్టు చేశారు.