బక్రీద్ వేళ గొర్రెలు, మేకల అమ్మకందారులు తస్మాత్ జాగ్రత్త!
బక్రీద్ పండుగ సమీపిస్తున్న తరుణంలో హైదరాబాద్లో గొర్రెలు, మేకల వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్ళు రెచ్చిపోతున్నారు. వారి పండుగ బిజీని ఆసరాగా చేసుకుని నకిలీ యాప్స్ తో మోసం చేస్తున్నారు. హైదరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ ఈ విషయంపై ఆందోళన వ్యక్తం చేస్తూ వ్యాపారులందరూ అత్యంత జాగ్రత్తగా ఉండాలని కీలక సూచనలు చేశారు.
ఫేక్ డిజిటల్ పేమెంట్ యాప్లతో బక్రీద్ వ్యాపారులను మోసం చేస్తున్న కేటుగాళ్ళు
బక్రీద్ హడావుడిని తమకు అనుకూలంగా మార్చుకుని కొందరు మోసగాళ్లు ఫేక్ డిజిటల్ పేమెంట్ యాప్లను ఉపయోగించి వ్యాపారులను మోసం చేస్తున్నారు. ముఖ్యంగా ఫోన్పే యాప్ను పోలి ఉండే నకిలీ అప్లికేషన్లను సృష్టించి, డబ్బు బదిలీ అయినట్లు కృత్రిమ స్క్రీన్షాట్లు చూపిస్తున్నారు. వ్యాపారులు స్క్రీన్పై కనిపించే యానిమేషన్ను నమ్మి గొర్రెలను, మేకలను వారికి అప్పగించేస్తున్నారు. కానీ నిజానికి డబ్బు వారి ఖాతాలో జమ కాదు.

గొర్రెలు, మేకల అమ్మకందారులను ఫేక్ చెల్లింపులతో మోసం
ఇటీవల కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇలాంటి ఒక ఘటన జరిగింది. మూడు బైక్లపై వచ్చిన ఆరుగురు వ్యక్తులు రూ.68 వేల విలువైన గొర్రెలను ఫేక్ యాప్ ద్వారా చెల్లింపు జరిగినట్లు చూపి తీసుకెళ్లిపోయారు. అదేవిధంగా రాజేంద్రనగర్లో నలుగురు మోసగాళ్లు రూ.48 వేల విలువైన జీవాలను మోసం చేసి తీసుకెళ్లారు. బాధితులు ఆలస్యంగా బ్యాంక్ ఖాతాలు చూసుకుని డబ్బు జమ కాలేదని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సీపీ సజ్జనార్ వ్యాపారులకు కొన్ని ముఖ్యమైన సూచనలు
సీపీ సజ్జనార్ వ్యాపారులకు కొన్ని ముఖ్యమైన సూచనలు ఇచ్చారు. ఎవరైనా ఆన్లైన్ పేమెంట్ చేస్తున్నారని చెప్పినప్పుడు కేవలం వారి ఫోన్లో కనిపించే స్క్రీన్షాట్ లేదా సక్సెస్ మెసేజ్ను నమ్మకూడదు. తప్పనిసరిగా స్వంత మొబైల్లో బ్యాంక్ యాప్ లేదా ఎస్ఎమ్ఎస్ చూసి డబ్బు నిజంగా వచ్చిందా లేదా అని నిర్ధారించుకోవాలి. పెద్ద మొత్తాల్లో లావాదేవీలు జరిగేటప్పుడు నగదు లావాదేవీలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
బక్రీద్ సందర్భంగా సంతల్లో రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల మోసాలు
ఏవైనా అనుమానాస్పద సంఘటనలు గమనించిన వెంటనే డయల్-100కి కాల్ చేయాలని లేదా సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలని సీపీ విజ్ఞప్తి చేశారు. బక్రీద్ సందర్భంగా సంతల్లో రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల మోసాలు ఎక్కువవుతున్నాయని, అందువల్ల ప్రతి వ్యాపారి అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.హైదరాబాద్ పోలీసులు ఈ మోసాలను అరికట్టడానికి ప్రత్యేక నిఘా పెట్టారు. వ్యాపారులు జాగ్రత్తగా ఉంటే ఇలాంటి మోసాలను తప్పించవచ్చని అధికారులు తెలిపారు.













Click it and Unblock the Notifications