అయ్యప్ప తోనే ఆటలా.. శబరిమల ఆలయంలో కిలోల్లో బంగారం మిస్సింగ్..?
కేరళలోని ప్రసిద్ధ శబరిమల ఆలయంలో విగ్రహాల బంగారు పూతపూసిన తాపడాల వ్యవహారం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. బంగారు తాపడాలు బరువు తగ్గడం పట్ల తీవ్ర కలకలం రేగుతోంది. ఉన్నట్టుండి తాపడాల బరువు 4.524 కేజీలు తగ్గడం పట్ల సర్వత్రా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయ్యప్ప స్వామి ఆలయం విషయంలోనే ఇలా జరగడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఆలయం గర్భగుడి ముందు ఉన్న ద్వారపాలక విగ్రహాలపై బంగారు పూతపూసిన రాగి తాపడాలను 2019లో మరమ్మతుల నిమిత్తం తొలగించారు. వాటిని సరి చేయించి కొత్త బంగారు పూత తాపడాలను అందిస్తానని ఉన్నికృష్ణన్ అనే దాత తీసుకెళ్లారు. ఈ పనిని చెన్నై లోని ఓ సంస్థకు అప్పగించారు. అయితే శబరిమల స్పెషల్ కమిషనర్కు సమాచారం ఇవ్వకుండానే.. బంగారు తాపడాలను తొలగించడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. కాగా ఆలయం నుంచి తాపడాలను తొలగించిన దాదాపు 40 రోజుల తర్వాత వాటిని చెన్నైలోని కంపెనీకి అందించినట్లు తెలిసింది.

అంతే కాకుండా 2019లో వాటిని తొలగించే సమయంలో తాపడాల బరువు 42.8 కిలోలుగా ఉన్నట్లు రికార్డుల్లో ఉంది. అయితే ఆ తాపడాలను తమ వద్దకు తెచ్చినప్పుడు బరువు 38.28 కిలోలు మాత్రమే ఉందని సదరు కంపెనీ తెలిపింది. దీంతో తాపడాలపై బంగారం బరువు తగ్గడాన్ని కేరళ హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. దీనిపై విజిలెన్స్ కమిటీ దర్యాప్తు చేపట్టాలని న్యాయస్థానం ఆదేశించింది.
తాపడాలను తిరిగి అమర్చినప్పుడు ఎందుకు బరువును సరిచూడలేదని న్యాయస్థానం ప్రశ్నించింది.
ఈ తగ్గుదలకు ఏకైక కారణంగా బంగారు పూత తగ్గడమే అని న్యాయస్థానం అభిప్రాయపడింది. లేదంటే దాత వాటి స్థానంలో మరో తాపడాల సెట్ను కంపెనీకి ఇచ్చే అవకాశం కూడా ఉన్నట్లు పేర్కొంది. విలువైన బంగారు పలకలను ఓ భక్తుడి ద్వారా ఎటువంటి భద్రత లేకుండా చెన్నైకి పంపించడంపై కూడా కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై విచారణ జరిపిన న్యాయమూర్తులు రాజా విజయరాఘవన్, కె.వి. జయకుమార్లతో కూడిన ధర్మాసనం ఇది చాలా తీవ్రమైన అంశం అని వ్యాఖ్యానించారు.
ఇందులో అనేక లోపాలు కనిపిస్తున్నాయని, బరువు ఎలా తగ్గిందో తెలుసుకునేందుకు విజిలెన్స్ కమిటీ దర్యాప్తునకు ఆదేశించింది. ఇందుకు సహకరించాలని ట్రావెన్కోర్ దేవస్వం బోర్డుకు సూచించింది. దీనిపై మూడు వారాల్లోగా పూర్తి నివేదికను అందజేయాలని స్పష్టం చేసింది. అనంతరం ఈ కేసు విచారణను సెప్టెంబరు 30వ తేదీకి వాయిదా వేసింది.

వాస్తవానికి ఈ ద్వారపాలకుల విగ్రహాలను 1999లో 40 ఏళ్ల వారెంటీతో తయారు చేశారు. అయితే ఇంకా ఎక్కువ సంవత్సరాలు గడవక ముందే లోపాలు తలెత్తడం, వాటి మరమ్మతుల్లో పారదర్శకత లోపించడం వంటి అంశాలు ఆలయ నిర్వహణపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. భక్తుల మనోభావాలను దెబ్బతీసే ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూడాలని కోర్టు సూచించింది.












Click it and Unblock the Notifications