నోట్ల రద్దు: నల్లకుబేరులకు మరో ఛాన్స్, ఐటీ సవరణ బిల్లు, ఇదీ లెక్క..
రూ.500, రూ.1000 నోట్ల రద్దు నేపథ్యంలో బ్యాంకులకు పెద్ద ఎత్తున డిపాజిట్లు వచ్చి పడ్డాయి. నోట్ల రద్దుతో కొత్త ఆదాయపన్ను సవరణ బిల్లును కేంద్రం తేనుంది.
న్యూఢిల్లీ: రూ.500, రూ.1000 నోట్ల రద్దు నేపథ్యంలో బ్యాంకులకు పెద్ద ఎత్తున డిపాజిట్లు వచ్చి పడ్డాయి. నోట్ల రద్దుతో కొత్తగా ఆదాయపన్ను సవరణ బిల్లును కేంద్రం తేనుంది. ఈ సవరణకు సంబంధించిన బిల్లును కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ లోకసభలో సోమవారం నాడు ప్రవేశ పెట్టారు.
నోట్ల రద్దు తర్వాత లెక్క చూపని డబ్బు పైన కేంద్రం 50 శాతం పెనాల్టీ విధించనుంది. మిగిలిన 50 శాతం డబ్బును సొంతదారుకు ఇస్తారు. ఆ యాభై శాతంలో 25 శాతం డబ్బును వెంటనే వాడుకోవడానికి అనుమతిస్తారు. మిగతా 25 శాతాన్ని మాత్రం నాలుగేళ్ల తర్వాత స్వల్ప వడ్డీకి ఇస్తారు.
ఉదాహరణకు ఎవరైనా రూ.1 కోటి డబ్బులు బ్యాంకులో డిపాజిట్ చేస్తే అందులో రూ.50 లక్షలు ప్రభుత్వ ఖజానాకు వెళ్తుంది. మిగిలిన రూ.50 లక్షలు ఎవరి డబ్బులో వారికి ఇస్తారు. అయితే, మొత్తం ఒకేసారి ఇవ్వరు. రూ.25 లక్షలను అప్పుడే అనుమతిస్తారు. మిగతా రూ.25 లక్షలను మాత్రం నాలుగేళ్ల తర్వాత స్వల్ప వడ్డీకి ఇస్తారు.
లెక్క చూపని ఆధాయం ఉంటే
లెక్క చూపని ఆదాయం ఉంటే వారికి మాత్రం వాచిపోనుంది. 73 శాతం వాత పడనుంది. లెక్క చూపని డబ్బు పైన 30 శాతం పన్ను, 10 శాతం పెనాల్టీ, 33 శాతం సర్ ఛార్జీ వసూలు చేస్తారు. మిగతావి కలుపుకొని దాదాపు ఎనభై శాతం డబ్బు ప్రభుత్వ పరం కానుంది. నగదు తర్వాత పెద్ద డిపాజిట్లలోని పన్నుల్లో దాదాపు 25 శాతం ప్రధాని గరీబ్ కళ్యాణ్ డిపాజిట్కు వెళ్లనున్నాయని తెలుస్తోంది.