చిత్రపరిశ్రమపై ఐటీ దాడులు... లిస్టులో అగ్ర కథానాయకుడు
తమిళ చలనచిత్ర పరిశ్రమలో ఆదాయపు పన్నుశాఖ దాడులు కలకలం సృష్టించాయి. పలువురు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు పన్ను ఎగవేతకు పాల్పడుతున్నారనే సమాచారంతో ఆదాయపు పన్నుశాఖ సోదాలు చేపట్టింది. రాజధాని చెన్నైతోపాటు మధురై తదితర 40కి పైగా ప్రాంతాల్లో ఈ తనిఖీలు కొనసాగుతున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు.
ఉదయం ఆరుగంటల నుంచి ప్రారంభమైన సోదాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. కలైపులి థాను, ఎస్ ఆర్ ప్రభు, జ్ఞానవేల్ రాజా, చెగియాన్ తో సహా పది మంది బడా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల ఆస్తులపై దాడులు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. చెగియాన్ నివాసం, ఆయనకు చెందిన సినిమా కార్యాలయం (గోపురం) పై కూడా దాడులు జరుగుతున్నాయి. చెగియాన్ పై దాడులు జరగడం వరుసగా ఇది మూడోసారి కావడం గమనార్హం. ఫిబ్రవరిలో చెన్నైలోని చెగియాన్ కు చెందిన ఇల్లు, కార్యాలయంపై ఆదాయపు పన్నుశాఖ దాడులు జరిగాయి.

తమిళ స్టార్ కథానాయకుడు విజయ్ నటించిన బిగిల్ సినిమా విడుదలైన తర్వాత ఈ తనిఖీలు జరిగాయి. ఆ సమయంలో ఆయన నుంచి అధికారులు దాదాపు రూ.65 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు విజయ్, మరికొందరు నిర్మాతల ఆర్థిక కార్యకలాపాలపై ఐటీ దృష్టిపెట్టింది. వీరిపై కూడా త్వరలోనే దాడులు జరిగే అవకాశమున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. పన్ను ఎగవేతకు సంబంధించి తమిళ చిత్ర పరిశ్రమపైనే ప్రతిసారీ ఆరోపణలు వస్తున్నాయి. కార్యకలాపాల నిర్వహణ, సంబంధిత ఆడిటింగ్ కచ్చితంగా లేకపోవడమే కారణమని ఆదాయపు పన్నుశాఖ వర్గాలు వెల్లడించాయి.












Click it and Unblock the Notifications