రూ.వెయ్యి కోట్లు ఎగ్గొట్టారు?: శశికళపై ఐటీ ఆపరేషన్లో తేలిన లెక్క, ఎవరినీ వదలట్లే
చెన్నైలోని నీలాంగరైలోని శశికళ బంధువు భాస్కరన్ ఇంట్లో లెక్కా పత్రం లేని 7కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
చెన్నై: గత రెండు రోజులుగా శశికళ కుటుంబాన్ని జల్లెడ పట్టినట్టుగా సోదాలు నిర్వహిస్తున్న ఐటీ అధికారులు.. ఆ కుటుంబం పన్ను ఎగవేతకు పాల్పడినట్టు నిర్దారించారు.
Recommended Video
బోగస్ కంపెనీలు, బోగస్ వ్యాపారాలతో ఏకంగా రూ.వెయ్యి కోట్ల దాకా పన్ను ఎగవేసినట్టు నిర్దారించారు. గతేడాది పెద్ద నోట్ల మార్పిడి సమయంలో ఈ సంస్థల ద్వారా పెద్ద ఎత్తున నగదు మార్పిడి జరగినట్టు ఐటీ అధికారులు తాజాగా గుర్తించారు.
ఆ కంపెనీల నుంచి నగదు మార్పిడి
పెద్ద నోట్ల మార్పిడి సమయంలో భారీగా నగదు మార్పిడి జరిగినట్టు నిర్దారించిన కంపెనీల్లో.. ఫెన్సీ స్టీల్, రెయిన్బో ఎయిర్ ప్రైవేట్ లిమిటెడ్, శుక్రా క్లబ్, ఇండో -దోహ కెమికల్స్ గత నెల మూతపడినట్టు గుర్తించారు. ఈ నాలుగు కంపెనీలకు శశికళ డైరెక్టర్గా ఉన్నట్టు గుర్తించారు. ఇండో-దోహా కంపెనీలో ఇళవరసి, ఆమె బంధువు కులోత్తుంగన్లు కూడా డైరెక్టర్లుగా ఉన్నట్టు తెలుస్తోంది.
7కేజీల బంగారం స్వాధీనం
శశికళ కుటుంబ ఆస్తులను టార్గెట్ చేసిన ఐటీ అధికారులు.. వరుసగా రెండో రోజు తమిళనాడు వ్యాప్తంగా 147 చోట్ల, 1800 మంది సిబ్బంది సోదాలు జరిపారు.చెన్నైలోని నీలాంగరైలోని శశికళ బంధువు భాస్కరన్ ఇంట్లో లెక్కా పత్రం లేని 7కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం జయా టీవీ, శశికళ భర్త, ఎంజీఆర్ పత్రిక కార్యాలయం, శశికళ న్యాయవాదులు, జ్యోతిష్కుడు, ఆడిటర్ల నివాసాల్లోను సోదాలు నిర్వహిస్తున్నారు.
భారీ నగదు, వస్తువులు స్వాధీనం
మన్నార్గుడిలో శశికళ సోదరుడు దివాకరన్ నిర్వహిస్తున్న సెంగమళతాయార్ మహిళా కాలేజీలోను భారీగా అక్రమ నగదు, వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. దాదాపు రూ.25 లక్షల నగదు, 6 రోలెక్స్ గడియారాలు, బంగారం, తదితరాలను స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 315బ్యాంకు ఖాతాలను కూడా నిలిపివేయించినట్టు తెలుస్తోంది.
కొడనాడు ఎస్టేట్ లోను సోదాలు
శుక్రవారం నాడు నీలగిరి జిల్లా కొడనాడు ఎస్టేట్, దాని సమీపంలో 600 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న గ్రీన్ టీ ఎస్టేట్లను ఐటీ అధికారులు తనిఖీలు చేశారు. ఎస్టేట్ మేనేజర్ ను రహస్య ప్రదేశానికి తరలించారు. ఎస్టేట్ లోని జయలలిత, శశికళ గదులకు సీలు వేయడం గమనార్హం. అలాగే తంజావూరులోని దినకరన్ నివాసంలో పలు ఆస్తులకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.
దినకరన్ తోడల్లుడి ఇంట్లో
తిరుచ్చి కేకేనగర్లోని దినకరన్ తోడల్లుడు డాక్టర్ శివకుమార్ ఇంటి వద్ద లేకపోవడంతో ఆయన ఇంటి తలుపులను ఖాదర్మొహిద్దీన్ అనే మారుతాళాల తయారీదారుతో తెరిపించారు. ఆ సమయంలో ఖాదర్ మొహిద్దీన్ బెంబేలెత్తిపోయాడు. మారుతాళంతో తలుపులు తెరుస్తున్న సమయంలో ఆ దృశ్యాన్ని వీడియో ద్వారా చిత్రీకరించారు. దీంతో శివకుమార్ కుటుంబం నుంచి తనకేమైనా జరిగితే.. ఐటీ అధికారులదే బాధ్యత అని అతను కన్నీటి పర్యంతమయ్యాడు.