పంజాబ్ మంత్రి నవ్జోత్సింగ్ సిద్ధు బ్యాంకు ఖాతాలను జప్తుచేసిన ఐటీ
న్యూఢిల్లీ: పంజాబ్ రాష్ట్ర మంత్రి నవ్జోత్ సింగ్ సిద్ధుకు చెందిన రెండు బ్యాంకు ఖాతాలను ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం జప్తు చేసింది. రూ.52లక్షల మేర పన్ను బకాయిలు ఆయన నుంచి రావాల్సి ఉండటంతో ఐటీ విభాగం గురువారం ఈ చర్యలు తీసుకుంది.
దుస్తుల కొనుగోలుపై రూ.28.3లక్షలు, ప్రయాణ ఖర్చులపై రూ.38.2లక్షలు, సిబ్బంది వేతనాలపై రూ.47.1లక్షలు, వాహనాల ఇంధనంపై రూ.17.8లక్షలు.. తాను చెల్లింపులు చేయాల్సి ఉన్నట్లు గతంలో పన్ను గణనల్లో సిద్ధు పేర్కొన్నారు.
కాగా, ఈ లావాదేవీలను రుజువు చేసే బిల్లులు, రసీదులేవీ ఆయన సమర్పించలేకపోయారని ఐటీ అధికారులు తెలిపారు. దీంతో ఖర్చులుగా చూపించినవాటిలో 30 శాతం మొత్తాన్ని అనర్హమైనదిగా గుర్తించినట్లు వెల్లడించారు.
గత సంవత్సరం జనవరి 17న ఐటీ విభాగం ఈ మేరకు ఇచ్చిన ఆదేశంపై సిద్ధు అప్పీలు చేసుకున్నారు. అయితే అక్కడా ఆయనకు చుక్కెదురైంది. దీంతో ఐటీ విభాగం తాజాగా సిద్దు బ్యాంకు ఖాతాలను జప్తు చేసింది.