కర్ణాటక అసెంబ్లీ పోరు ఇక రసవత్తరం: సిద్ధూ వర్సెస్ ఎడ్డీ.. కులాల వారీ సమీకరణాలు
వచ్చే ఏడాది మొదట్లో జరిగే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పట్నుంచే రంగం సిద్ధమవుతోంది. సీఎం సిద్దరామయ్య సారథ్యంలో ఎన్నికల బరిలోకి దిగుతామని అధిరాన కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.
బెంగళూరు: వచ్చే ఏడాది మొదట్లో జరిగే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పట్నుంచే రంగం సిద్ధమవుతోంది. సీఎం సిద్దరామయ్య సారథ్యంలో ఎన్నికల బరిలోకి దిగుతామని అధిరాన కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. కొన్నిరోజుల క్రితం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కూడా కర్ణాటక సీఎం అభ్యర్థి బీఎస్ యెడ్యూరప్ప ఆధ్వర్యంలోనే ప్రజా క్షేత్రంలోకి వెళతామని పేర్కొన్నారు.
బీజేపీ సీఎం అభ్యర్థిగా యెడ్యూరప్ప అభ్యర్థిని ప్రకటించిన తర్వాతే కాంగ్రెస్ పార్టీ తన వ్యూహాన్ని బయట పెట్టడం గమనార్హం.కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వచ్చేనెలలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. దీంతో రెండు పార్టీలకు చెందిన కాకలు తీరిన యోధుల మధ్య ఎన్నికల సంగ్రామం కొనసాగనున్నది.
మధ్యలో మాజీ ప్రధాని హెచ్ డీ దేవెగౌడ సారథ్యంలో సెక్యులర్ జనతాదళ్ పార్టీ పాత్ర ఏమిటన్నసంగతి తేలాల్సి ఉన్నది. ఈ నేపథ్యంలో కర్ణాటక పీసీసీ అధ్యక్షుడుగా డాక్టర్ జీ పరమేశ్వర యధాతథంగా కొనసాగుతారు. కానీ రాష్ట్ర మంత్రిగా వైదొలగాల్సి ఉంటుంది. తద్వారా పార్టీ కార్యకలాపాలపై పూర్తిగా అంకితం అవుతారు.
పరమేశ్వర ఇలా...
ప్రస్తుతం పరమేశ్వర.. సీఎం సిద్దరామయ్య క్యాబినెట్లో హోం శాఖ మంత్రిగా పని చేస్తున్నారు. కర్ణాటక రాష్ట్ర కాంగ్రెస్ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్గా రాష్ట్ర మంత్రి డీకే శివకుమార్ నియమితులు అయ్యారు. కోలార్ లోక్ సభ సభ్యుడు కేహెచ్ మునియప్ప కమిటీలో ప్రత్యేక ఆహ్వానితుడిగా ఉన్నారు. పార్టీలో క్రమశిక్షణ పాటించాల్సిన అవసరం ఉన్నదని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు స్పష్టమైన సంకేతాలిచ్చారు. బహిరంగంగా ఎటువంటి చర్చ జరిగినా వేటు తప్పదని హెచ్చరించారు. కర్ణాటకలో అధికారాన్ని కాపాడుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నది. వచ్చే నెలలో 80 వేల బూత్ స్థాయి నాయకులతో నేరుగా సంభాషించడం ద్వారా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు.
పూర్తిస్థాయిలో కాంగ్రెస్ కార్యవర్గానికి కాయకల్ప చికిత్స
అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ కార్యవర్గానికి పూర్తిస్థాయి కాయకల్ప చికిత్స చేయాలని సంకల్పించింది. జీ పరమేశ్వరను పీసీసీ అధ్యక్షుడిగా ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. తద్వారా తాము దళితుల పక్షమేనన్న సంకేతాలు ఇవ్వదలిచిందీ కాంగ్రెస్ పార్టీ. సంస్థాగతంగా బలోపేతం కావాలని భావిస్తున్నది. కులాల వారీగా సమతూకం సాధించేందుకు భారీ కసరత్తు చేసింది. ఉత్తర కర్ణాటక ప్రాంతానికి చెందిన లింగాయత్ల నాయకుడు ఎస్ఆర్ పాటిల్ను పార్టీ ఉత్తర కర్ణాటక ప్రాంత వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించారు. దక్షిణ ప్రాంత పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా దినేశ్ గుండూరావు కొనసాగుతారు. ఇక వొక్కలిగ సామాజిక వర్గ నేత రాష్ట్ర మంత్రి డీ కే శివకుమార్ను పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్గా ఉంటారు. ఏడు సార్లు ఎంపీగా ఎన్నికైన దళిత నేత కేహెచ్ మునియప్పను పార్టీ వర్కింగ్ కమిటీలో సభ్యురాలిగా నియమించి దళితులకు ప్రాధాన్యం ఇస్తున్నామన్న సంకేతాలిచ్చారు. సతీశ్ జక్రీహోలీ మరొక అసమ్మతి ఎమ్మల్యే. ఆయనతోపాటు మరికొందరు రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. తర్వాత సతీశ్ జక్రీహోలి ఎఐసిసి కార్యదర్శి నియమితులయ్యారు.
ఎడ్యూరప్పపై వివాదాల సుడిగుండాలు
బీజేపీ సీనియర్ నేత బీఎస్ యెడ్యూరప్ప దక్షిణ భారతదేశంలో పార్టీ బలోపతానికి చర్యలు చేపట్టారు. 2006లో సెక్యులర్ జనతాదళ్ (జేడీఎస్) నాయకుడు హెచ్ డీ కుమారస్వామితో సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా చేరారు. వారు కుదుర్చుకున్న ఒప్పందం అమలులో ఇరు పార్టీలు సరిగ్గా స్పందించలేదు. తర్వాత జరిగిన మధ్యంతర ఎన్నికల్లో యెడ్యూరప్ప సర్కార్ కొలువు దీరినా అవినీతి ఆరోపణలు వెంటాడాయి. తప్పనిసరి పరిస్థితుల్లో సీఎంగా వైదొలిగిన యెడ్యూరప్ప.. తర్వాత సదానంద గౌడ, ఆ తర్వాత జగదీశ్ షెట్టార్ సీఎంలుగా వ్యవహరించారు. 2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక.. కర్ణాటకపై ఆశలు పెంచుకున్నారు. తాను సీఎం కావాలంటే బీజేపీని గెలిపించాలని పదేపదే ప్రకటనలు గుప్పించారని అధికార కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పిస్తోంది. ఇక ఇటీవల దళితవాడలో సహపంక్తి భోజనాల్లో ఆయన హోటల్ నుంచి తెప్పించుకున్న భోజనం విమర్శలు తెచ్చి పెట్టింది.