హ్యాకింగ్ ఆరోపణలపై ఆధారాల్లేవు.. ప్రభుత్వంపై కుట్ర చేసేందుకే: సభలో మంత్రి అశ్విని వైష్ణవ్
పార్లమెంటు సమావేశాల కంటే కొన్ని గంటల ముందు పెగాసస్ హ్యాకింగ్ ఉదంతం బయట పడటం యాదృశ్చికం కాదని అది కావాలనే ఎవరో తప్పుదోవ పట్టించేందుకు తెరపైకి తీసుకొచ్చారని అన్నారు కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్. ప్రతిపక్ష నాయకులు, జర్నలిస్టులు, ఇతరుల ఫోన్ కాల్స్ హ్యాక్ చేసేందుకు ఇజ్రాయిల్ స్పైవేర్ పెగాసిస్ను ప్రభుత్వం వినియోగిస్తోందన్న వార్తలను మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఖండించారు.
లోక్సభలో ఈ రోజు ఇదే అంశంపై విపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. దీనిపై మంత్రి సమాధానం ఇస్తూ ప్రతిపక్షాలు, కొన్ని మీడియా సంస్థలు బయట పెట్టిన ఈ హ్యాకింగ్ అంశంపై ఎలాంటి ఆధారాలు లేవని మంత్రి స్పష్టం చేశారు. అక్రమమైన మార్గంలో ఒకరి వ్యక్తిగత సమాచారంపై నిఘా పెట్టడం భారత్లో సాధ్యం కాదని మంత్రి స్పష్టం చేశారు. గత రాత్రి ఓ జాతీయ వెబ్సైట్లో సంచలన కథనం ప్రచురితమైంది. తెల్లారగానే ఈ అంశంపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. పార్లమెంటు సమావేశాలకు ముందు మాత్రమే ఇలాంటివి రావడమంటే దీని వెనక ఏదో పెద్ద కుట్ర ఉందని మంత్రి అన్నారు. ఆ కథనంలో వచ్చిన రిపోర్ట్స్ అన్నీ నిరాధారమైనవని మంత్రి కొట్టిపారేశారు.

గతంలో కూడా వాట్సాప్ హ్యాక్ అయిందంటూ అది కూడా పెగాసస్ వినియోగించే ఇది జరిగిందనే ఆరోపణలు వచ్చినట్లు మంత్రి అశ్వినీ వైష్ణవ్ గుర్తు చేశారు. అయితే దీనిపై ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో అప్పట్లో అన్ని పార్టీలు దీన్ని ఖండించాయన్న విషయాన్ని గుర్తు చేశారు. ఇక జూలై 18వ తేదీన వచ్చిన రిపోర్ట్స్లో కూడా వాస్తవం లేదని ప్రజాస్వామ్యంను భ్రష్టు పట్టించడంతో పాటు కొన్ని గొప్ప వ్యవస్థలను అవమానించడమే అవుతుందని మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు.
ఇదంతా ఇలా ఉంటే మంత్రి అశ్వినీ వైష్ణవ్ సభలో ప్రకటన చేసిన కొన్ని గంటల్లోనే తన ఫోన్ కూడా హ్యాక్ అయినట్లు అమెరికా పత్రిక వాషింగ్టన్ పోస్టుకథనం రాసుకొచ్చింది.












Click it and Unblock the Notifications