ఐటీ దాడుల రూటు మారింది: రాడార్లో..!!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడుల తీవ్రత మరింత పెరిగింది. కొత్త దారి పట్టింది. ఇదివరకు పన్ను ఎగవేతదారులు, రాజకీయ నాయకులు, వారి సంబంధిత వ్యక్తులు/సంస్థలపై సాగిన ఐటీ దాడుల రూటు మారింది. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన కొన్ని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధుల నివాసాలను టార్గెట్గా చేసుకుంది. సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ అండ్ ఛారిటీ ఆర్గనైజేషన్ ఒక్సాఫామ్ ఇండియాకు చెందిన ఢిల్లీ కార్యాలయాల్లో ఆదాయపు పన్ను శాఖ సోదాలు నిర్వహించింది. ఈ మేరకు ఓ జాతీయ ఆంగ్ల దినపత్రిక వెబ్సైట్ ఓ కథనాన్ని ప్రచురించింది.
దీనితో పాటు బెంగళూరుకు చెందిన ఇండిపెండెంట్, పబ్లిక్-స్పిరిటెడ్ మీడియా ఫౌండేషన్ (ఐపీఎస్ఎంఎఫ్)ను కూడా ఆ శఖాధికారులు తమ రాడార్ పరిధిలోకి తీసుకొచ్చారు. ది కారవాన్, ది ప్రింట్, స్వరాజ్య వంటి అనేక డిజిటల్ మీడియా అవుట్లెట్లకు పాక్షికంగా నిధులు సమకూరుతున్నాయనే ఉద్దేశంతో ఈ దాడులు సాగినట్లు చెబుతున్నారు. దీనిపై ఆయా సంస్థలు ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. అటు ఐటీ శాఖ కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు.
స్వతంత్రంగా వ్యవహరిస్తోన్న సీపీఆర్ స్వచ్ఛంద సంస్థ- పాలకుల విధానాలను విమర్శనాత్మక దృష్టికోణంతో చూస్తుంటుంది. కేంద్రంలో ఎన్డీఏ లేదా యూపీఏ అధికారంలో ఉన్నా- పాలనలో లోపాలను ఎత్తి చూపుతుంటుందా సంస్థ. దీనికి ఒకప్పుడు విద్యా వేత్త ప్రతాప్ భాను మెహతా నాయకత్వం వహించారు. ప్రస్తుతం బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వంపై తరచూ విమర్శలను సంధిస్తుంటారు.
ప్రస్తుతం దాని పాలక మండలికి జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో మాజీ లెక్చరర్, ఢిల్లీలోని లేడీ శ్రీరాం కళాశాల ప్రిన్సిపాల్గా పనిచేసిన మీనాక్షి గోపీనాథ్ అధ్యక్షత వహిస్తున్నారు. 1973లో ఏర్పడిన సంస్థ సీపీఆర్. బెంగళూరు ప్రధాన కేంద్రంగా ఐపీఎస్ఎంఎఫ్ కూడా ప్రభుత్వాలను ప్రశ్నించే పరిశోధనాత్మక కథనాలకు ప్రచురిస్తుంటుంది. కొన్ని సంస్థలకు నిధులను సమకూరుస్తుందనే ఆరోపణలను ఎదుర్కొంటోంది సంస్థ.
2002 గుజరాత్ అల్లర్లలో అప్పటి ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఎలాంటి పాత్ర లేదంటూ ఇచ్చిన నివేదికను ఐపీఎస్ఎంఎఫ్ ప్రశ్నించింది. దీనికి ఛైర్మన్గా ప్రముఖ జర్నలిస్ట్ టీఎస్ నివాస్ పని చేస్తోన్నారు. ట్రస్టీలలో నటుడు అమోల్ పాలేకర్ ఉన్నారు. దాని దాతలలో విప్రో అధినేత అజీమ్ ప్రేమ్జీ, గోద్రేజ్, నందన్ నీలేకని ఉన్నారు. ఒక్సాఫామ్ కింద ఉన్న ఎన్జీఓ గ్లోబల్ కన్సార్టియం కూడా ఐటీ దాడులను ఎదుర్కొంటోంది.