వ్యాపారి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడికి ఐటీ షాక్: బెంగళూరు జ్యువెలర్స్ షో రూంలో!
బెంగళూరు: కర్ణాటక శాసన సభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఆదాయపన్ను శాఖ (ఐటీ శాఖ) అధికారులు బీజేపీ నాయకులకు ఝలక్ ఇచ్చారు. బీజేపీ కర్ణాటక రాష్ట్ర శాఖ ఉపాధ్యక్షుడు, బంగారు నగల వ్యాపారి కేపీ. నంజుండికి ఆదాయపన్ను శాఖ అధికారులు షాక్ ఇచ్చారు.
విశ్వకర్మ మహాసభ అధ్యక్షుడు అయిన కేపీ. నంజుండికి చెందిన ఇళ్లు, కార్యాలయం, ఆయన నిర్వహిస్తున్న జ్యువెలర్స్ షో రూంల్లో జనవరి 4వ తేదీ గురువారం ఏకకాలంలో ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేసి సోదాలు చేస్తున్నారు.
బీజేపీ కర్ణాటక ఉపాధ్యక్షుడు అయిన కేపీ నంజుండికి బెంగళూరు నగరంలో జ్యువెలర్స్ షో రూంలు ఉన్నాయి. ఆయన మీద కొంత కాలంగా నిఘా వేసిన ఆదాయపన్ను శాఖ అధికారులు గురువారం ఒక్క సారిగా షాక్ ఇచ్చారు. కేపీ. నంజుండి ఆదాయపన్ను ఎగవేశారని ఆరోపణలు రావడంతో ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేశారు.
కేపీ నంజుండి బంధువులు, ఆయన కార్యాలయం సిబ్బంది, జ్యువెలర్స్ లో పని చేస్తున్న ఉద్యోగులు నివాసాల్లో సోదాలు చేస్తున్న అధికారులు వివిధ పత్రాలు పరిశీలిస్తున్నారు. బళ్లారి, గదగ్ లో ఆదాయానికి మించి అక్రమాస్తులు సంపాధించారని గుర్తించిన ఏసీబీ అధికారులు పలువురు అధికారుల నివాసాల్లో దాడులు చేసి అక్రమాస్తులు గుర్తిస్తున్నారు.