15 గంటలు.. 40 కిలోమీటర్లు: ఆస్ప్రత్రికి మహిళను మోసుకెళ్లిన ఐటీబీపీ జవాన్లు, రియల్ హీరోస్
డెహ్రాడూన్: దేశ రక్షణతోపాటు దేశంలో ప్రజలకు ఎప్పుడు, ఎలాంటి ఆపద వచ్చినా.. మేమున్నామంటూ భారత రక్షణ బలగాలు ధైర్యాన్ని కల్పిస్తాయి. తాజాగా, వారు చేసిన ఓ మంచి పని ఇప్పుడు మరోసారి దేశ ప్రజల మన్ననలను అందుకుంటోంది. గాయపడిన ఓ మహిళను ఎంతో శ్రమించి ఆస్పత్రిలో చేర్చారు. సుమారు 15 గంటలపాటు ఆమెను మోసుకుంటూ వెళ్లడం గమనార్హం.
Recommended Video

మహిళను కాపాడేందుకు ఐటీబీపీ బలగాలు..
వివరాల్లోకి వెళితే.. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పితోర్గఢ్ జిల్లా లాప్సా అనే మారుమూల గ్రామానికి చెందిన ఓ మహిళ.. ఆగస్టు 20న ప్రమాదవశాత్తూ కొండపై నుంచి జారిపడటంతో ఆమె రెండు కాళ్లూ విరిగిపోయాయి. మారుమూల ప్రాంతం కావడంతో అక్కడకు హెలికాప్టర్ కూడా చేరుకునే పరిస్థితి లేకపోయింది. ఈ నేపథ్యంలో ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్(ఐటీబీపీ) భద్రతా బలగాలు ఆమెకు సాయం చేసేందుకు ముందుకు వచ్చాయి.

40 కిలోమీటర్లు.. 15 గంటలపాటు..
మహిళ నివసిస్తున్న గ్రామానికి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న మిలాం బోర్డర్లో గస్తీ కాస్తున్న 14వ బెటాలియన్కు చెందిన 25 మంది సిబ్బంది ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లుందుకు వచ్చారు. స్ట్రెచర్పై గాయపడిన మహిళను ఉంచి రోడ్డు మార్గానికి చేర్చేందుకు సుమారు 40 కిలోమీటర్ల దూరం నడిచారు. అంతేగాక, మార్గమధ్యలో వచ్చిన వాగులు, వంకలను కూడా దాటారు. సుమారు 15 గంటలపాటు ఆమెను మోసుకుంటూ వెళ్లి ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
రియల్ హీరోస్.. భారతమాత ముద్దు బిడ్డలంటూ..
ఈ విషయం తెలుసుకున్న కేంద్రమంత్రి హర్షవర్ధన్ జవాన్ల సాహసాన్ని కొనియాడారు. దేశ సరిహద్దులనే కాదు.. అవసరమైతే ప్రజల ప్రాణాలను కాపాడేందుకు శౌర్యాన్ని, విదేయతను, పట్టుదలను ఐటీబీపీ చాటుతుందని మరోసారి నిరూపించారంటూ ట్విట్టర్ వేదికగా ప్రశంసించారు. రియల్ హీరోస్, భారత మాత ముద్దు బిడ్డలంటూ పలువురు నెటిజన్ల జవాన్లపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.












Click it and Unblock the Notifications