ఫిర్ ఏక్బార్... మోడీ సర్కార్: ఇది ప్రజల నినాదం అన్న ప్రధాని
Recommended Video
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలిసారిగా ఒక ప్రభుత్వంపై ప్రేమతో మరలా అధికారంలోకి ప్రజలు ఎలా తీసుకొచ్చారని పొలిటికల్ విశ్లేషకులు ఎన్నికల తర్వాత తలలు పట్టుకోవడం ఖాయమని ప్రధాని నరేంద్ర మోడీ జోస్యం చెప్పారు. నామినేషన్ దాఖలకు ముందు ఆయన వారణాసిలో కార్యకర్తలను అభిమానులను ఉద్దేశించి ప్రసంగించారు.
ఉత్తర్ ప్రదేశ్లోని వారణాసిలో గురువారం మెగా రోడ్షోలో పాల్గొని కార్యకర్తల్లో జోష్ నింపిన ప్రధాని శుక్రవారం వారిని ఉద్దేశించి ప్రసంగించారు. 2019 ఎన్నికలు అయిపోయాయని ఇక ప్రభుత్వ వ్యతిరేకత కాకుండా ప్రభుత్వంపై ప్రేమతో తిరిగి బీజేపీని ఎలా అందలం ఎక్కించారని పొలిటికల్ అనలిస్టులు తలలు పట్టుకుంటారని మోడీ అన్నారు. ఇప్పటి వరకు తాను ఎన్నో ఎన్నికలను చూశానని అయితే తొలిసారిగా ప్రభుత్వ వ్యతిరేకత కాకుండా ఇదే ప్రభుత్వం మళ్లీ మళ్లీ రావాలని ప్రజలు కోరుకుంటున్నట్లు చూస్తున్నానని తెలిపారు.
గురువారం జరిగిన రోడ్షోకు వచ్చిన స్పందన చూస్తే వారణాసి నుంచి తనను ఇప్పటికే ప్రజలు గెలిపించారనే భావన కలిగిందని మోడీ అన్నారు. అందరికీ ముందస్తుగా అభినందనలు తెలుపుతున్నట్లు చెప్పారు. వారణాసిలో కార్యకర్తలు కష్టాన్ని, చెమటను ధారపోశారని మోడీ చెప్పడంతో సభా ప్రాంగణం మోడీ నినాదాలతో మార్మోగిపోయింది. ఇదిలా ఉంటే ఈసారి వారణాసికి జరిగే ఎన్నికల్లో గత రికార్డులన్నీ తుడుచుపెట్టుకుపోవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ సారి మహిళా ఓటర్ల శాతం కనీసం 5శాతం పెరగాలని సూచించిన మోడీ... ఇది గుజరాత్లో తాను చేయాలనుకున్నప్పటికీ అక్కడ సాధ్యపడలేదని చెప్పారు. దేశంలో సంతోషకరమైన వాతావరణం ఉందంటే అందుకు కారణం బీజేపీ కార్యకర్తలే అని చెప్పిన ప్రధాని.. ఎటు వెళ్లినా మోడీ సర్కార్ మళ్లీ రావాలని ప్రజలు కోరుకుంటున్నట్లు చెప్పారు.