జమ్ము కాశ్మీర్ డీ లిమిటేషన్ పూర్తి - 90 అసెంబ్లీ నియోజకవర్గాలు : పండిట్స్ కు రెండు స్థానాలు..!!
జమ్ము కాశ్మీర్ లో అసెంబ్లీ స్థానాల డీ లిమిటేషన్ ప్రక్రియ పూర్తయింది. జమ్ముకశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు వీలుగా నియోజకవర్గాల పునర్విభజన తుది ఆదేశాలపై డిలిమిటేషన్ కమిషన్ సంతకాలు చేసింది. నోటిఫికేషన్ కూడా జారీ అయింది. నోటిఫికేషన్ ప్రకారం ఈ కేంద్ర పాలిత ప్రాంతంలో మొత్తం 90 శాసన సభ నియోజకవర్గాలను ఏర్పాటు చేశారు. వీటిలో 43 నియోజకవర్గాలు జమ్మూ ప్రాంతంలోనూ, 47 నియోజకవర్గాలు కశ్మీరు ప్రాంతంలోనూ ఉన్నాయి. షెడ్యూల్డు తెగలకు 9 స్థానాలకు కేటాయించారు.
రాజకీయ పార్టీల ప్రతినిధులు, సాధారణ ప్రజలు, పౌర సమాజంలోని వివిధ సంఘాలను సంప్రదించిన తర్వాత ఈ కేంద్ర పాలిత ప్రాంతంలో 9 శాసన సభ స్థానాలను ఎస్టీలకు కేటాయించాలని నిర్ణయించారు. వీటిలో ఆరు స్థానాలు జమ్మూ ప్రాంతంలోనూ, మూడు స్థానాలు కశ్మీరు లోయలోనూ ఉన్నాయి. భారత రాజ్యాంగంలోని అధికరణలు 330, 332లతోపాటు జమ్మూ-కశ్మీరు రీఆర్గనైజేషన్ యాక్ట్, 2019లోని సెక్షన్ 7(6), సెక్షన్ 7(7) ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు శాసన సభ నియోజకవర్గాల్లో రిజర్వేషన్లను కల్పించినట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది.
దీని కోసం 2011 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకున్నట్లు పేర్కొంది. ఎస్టీలకు 9, ఎస్సీలకు 7 నియోజకవర్గాలను కేటాయించినట్లు వివరించింది. ఇప్పటి వరకు కశ్మీర్ డివిజన్లో 46 సీట్లు, జమ్ము డివిజన్లో 37 సీట్లు ఉండేవి. 2020, మార్చిలో జమ్ముకశ్మీర్లో శాసనసభ నియోజకవర్గాల పునర్విభజన కోసం డిలిమిటేషన్ కమిషన్ ఏర్పాటైంది. డీలిమిటేషన్ యాక్ట్, 2002లోని సెక్షన్ 9(1)(ఏ), జమ్మూ-కశ్మీరు రీఆర్గనైజేషన్ యాక్ట్, 2019లోని సెక్షన్ 60(2)(బీ) ప్రకారం ఈ ప్రక్రియ జరిగింది. కశ్మీరు లోయలోని అనంత్నాగ్, జమ్మూ ప్రాంతంలోని రాజౌరీ, పూంఛ్లను కలుపుతూ ఓ లోక్సభ నియోజకవర్గాన్ని ఏర్పాటు చేశారు.
దీంతో ప్రతి లోక్సభ నియోజకవర్గంలోనూ 18 చొప్పున శాసన సభ నియోజకవర్గాలు ఏర్పాటయ్యాయి. స్థానిక డిమాండ్ మేరకు కొన్ని శాసన సభ నియోజకవర్గాల పేర్లను కూడా మార్చారు. ఈ మధ్య కాలంలోనే జమ్ము కాశ్మీర్ లో ప్రధాని పర్యటించారు. అక్కడ జరుగుతున్న డెవలప్ మెంట్ తో పరిస్థితులు పూర్తిగా మారిపోతాయని ఆశాభావం వ్యక్తం చేసారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరుతాయని చెప్పుకొచ్చారు.
అయితే, ఇప్పుడు తాజాగా డీలిమిటేషన్ లో భాగంగా రెండు స్థానాలను కాశ్మీర్ పండిట్స్ కు కేటాయించింది. అదే విధంగా..అందులో ఒకరు మహిళ ఉండాలని ప్రతిపాదించింది. ఇక, కాశ్మీర్ నుంచి వలస వెళ్లిన వారికి సైతం రెండు సీట్లు కేటాయించాలని ప్రతిపాదించినట్లుగా తెలుస్తోంది.