ఏకె-47పై ఉన్న వేలికంటే ఈవిఎంపై వేలికి శక్తి ఎక్కువ: మోడీ
శ్రీనగర్: ఏకె-47 ఆయుధంపై ఉన్న వేలికంటే మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకునే ఈవిఎంపై ఉన్న వేలికే ఎక్కువ శక్తి ఉంటుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఇది జమ్మూకాశ్మీర్ ప్రజలు నిరూపిస్తున్నారని చెప్పారు. జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన సాంబాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బుల్లె కన్నా బ్యాలెట్ చాలా శక్తివంతమైనదని పేర్కొన్నారు.
ఇక్కడి పాలకుల వల్లే ఉగ్రవాదం పెరుగుతోందని చెప్పారు. వారసత్వ రాజకీయాలకు అంతం పలికే సమయం వచ్చిందని అన్నారు. జమ్మూకాశ్మీర్ ప్రజలు హంగ్ అసెంబ్లీకి అవకాశం ఇవ్వవద్దని మోడీ అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే భారతీయ జనతా పార్టీకి పూర్తి ఆధిక్యం ఇవ్వాలని ప్రజలను కోరారు.

తనపై ప్రేమ చూపిస్తే.. అభివృద్ధి రూపంలో వడ్డీతో సహా తిరిగి ఇస్తానని మోడీ జమ్మూకాశ్మీర్ ప్రజలనుద్దేశించి అన్నారు. కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలపై మోడీ విమర్శల వర్షం కురిపించారు. గత ప్రభుత్వాలు జమ్మూ ప్రజల సంక్షేమాన్ని విస్మరించాయని ధ్వజమెత్తారు.
దేశ ప్రజలందరికీ సమాన అవకాశాలు కల్పించడమే బీజేపీ లక్ష్యమని మోడీ ప్రకటించారు. కాంగ్రెస్ అవకాశవాద పార్టీ అని పేర్కొన్నారు. కాగా, మోడీ పర్యటన సందర్భంగా సాంబా జిల్లాలో అసాధారణ భద్రతా ఏర్పాట్లను చేశారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో జమ్మూ వచ్చిన మోడీ.. అక్కడ్నుంచి హెలికాప్టర్లో ప్రచార వేదిక వద్దకు చేరుకున్నారు.












Click it and Unblock the Notifications