విసిగించాడని తోటమాలిని జైలుకు పంపిన మహిళా ఐఏఎస్
గోరఖ్పూర్: యోగా చేస్తుంటే తోటమాలి గడ్డి కత్తిరిస్తూ విసిగించాడని ఓ ఐఏఎస్ అధికారిణి అతడ్ని జైలుకు పంపారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గోరఖ్పూర్లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గోరఖ్పూర్ జిల్లాలో ఎస్డీఎం సదార్గా పనిచేస్తున్న ఐఏఎస్ అధికారిణి నేహ ప్రకాశ్ మంగళవారం ఉదయం గోరఖ్పూర్ యూనివర్సిటీ సమీపంలోని ఓ పార్కులో యోగా చేస్తున్నారు.
అక్కడ పనిచేసే విశ్వనాథ్ యాదవ్ తోటలో మిషన్తో గడ్డి కత్తిరిస్తున్నాడు. దీంతో నేహ తనకు దుమ్ము ఎలర్జీగా ఉందని.. యోగాకు భంగం కలుగుతోందని గడ్డి కత్తిరించొద్దని హెచ్చరించారు. అతడు కాసేపు ఆగి మళ్లీ గడ్డి కత్తిరించడం ప్రారంభించాడు.
దీంతో నేహ విసుగు చెంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రశాంతతకు భంగం కలిగించాడనే ఫిర్యాదుతో తోటమాలిని మంగళవారం సాయంత్రం జైలుకు పంపించారు. కాగా, 2012 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన నేహ ప్రకాశ్కు వివాదాలు కొత్తేమీ కాదు. గతంలోనూ ఆమెపై పలు వివాదాలు ఉన్నాయి.
అనుచితంగా ప్రవర్తించాడని సమాజ్వాదీ పార్టీకి చెందిన ఓ కార్యకర్తను ఆమె గతంలో జైలుకు పంపారు. నేహ భర్త వైభవ్ శ్రీవాత్సవ కూడా ఐఏఎస్ అధికారి. ఆయన మవు జిల్లాకు కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు. కాగా, వరుస వివాదాల కారణంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి అధికారుల పట్ల నియంత్రణ లేకుండా పోయిందని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు.