జైట్లీకి కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్: 'పీయూష్ గోయల్'కి అదనపు బాధ్యతలు, స్మృతి ఇరానీకి షాక్
న్యూఢిల్లీ: కొంతకాలంగా మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్న కేంద్రమంత్రి అరుణ్ జైట్లీకి ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు సోమవారం శస్త్ర చికిత్స నిర్వహించారు. కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ శస్త్ర చికిత్స నిమిత్తం వైద్యులు నాలుగున్నర గంటలు శ్రమించారు. ఆపరేషన్ విజయవంతమైందని సర్జరీ అనంతరం ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
కిడ్నీ సమస్య కారణంగా ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఆయన ఇంటికే పరిమితమైపోయారు. కార్యాలయానికి కూడా రావడం లేదు. ఈ నేపథ్యంలోనే శనివారం ఆసుపత్రిలో చేరిన ఆయనకు సోమవారం శస్త్ర చికిత్స నిర్వహించారు. ఉదయం 8.30గం.కి మొదలైన సర్జరీ మధ్యాహ్నాం ఒంటిగంటకు పూర్తయింది. అనంతరం ఆయన్ను ఐసీయూకి తరలించారు.

కిడ్నీ దాతతో పాటు జైట్లీ ఆరోగ్యం కూడా నిలకడగా ఉందని, ఇద్దరి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని వైద్యులు తెలిపారు. జైట్లీ బంధువైన ఓ మహిళ కిడ్నీ దానం చేసినట్టు పేర్కొన్నారు.కాగా, శస్త్ర చికిత్సకు ముందు జైట్లీతో ప్రధాని మోడీ మాట్లాడారు. జైట్లీ ఆరోగ్యంపై ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడి ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటున్నారు. వైద్యుల సమాచారం మేరకు జైట్లీ మరో 10-15రోజులు ఆసుపత్రికే పరిమితమయ్యే అవకాశం ఉంది.
అపోలో ఆసుపత్రి వైద్యుడు సందీప్ గులేరియా, సర్జన్ వీకె బన్సల్, నెఫ్రాలజిస్ట్ సందీప్ మహాజన్, ఎయిమ్స్ డైరెక్టర్ రణ్ దీప్ గులేరియాలతో కూడిన వైద్య బృందం ఈ శస్త్ర చికిత్స నిర్వహించింది. సర్జరీ అనంతరం కేంద్రమంత్రులు జితేందర్ సింగ్, పీయూష్ గోయల్ లతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆసుపత్రికి వచ్చి జైట్లీని పలకరించారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సైతం జైట్లీ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు.
'పీయూష్ గోయల్'కి అదనపు బాధ్యతలు:
కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ సర్జరీ కారణంగా మరో 8వారాల పాటు కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ ఆసుపత్రికే పరిమితమయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి రైల్వేమంత్రి పీయూష్ గోయల్ కు ఆర్థికశాఖ బాధ్యతలను కూడా అప్పగించారు.
పెరుగుతున్న చమురు ధరలు, బ్యాంకు లోన్లు, నీరవ్ మోడీ కుంభకోణం వంటి కీలక అంశాలను డీల్ చేయాల్సిన తరుణంలో జైట్లీకి విశ్రాంతి అవసరం కావడంతో.. గోయల్ కు ఈ అదనపు బాధ్యతలు అప్పగించారు. కాగా, గతంలో 2012లో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఆర్థికమంత్రిగా ఒక నెల రోజుల పాటు అదనపు బాధ్యతలు నిర్వహించారు. అప్పటిదాకా ఆర్థికమంత్రిగా సేవలందించిన ప్రణబ్ ముఖర్జీని రాష్ట్రపతిని చేయడంతో ఆ బాధ్యతలు మన్మోహన్ సింగ్ చేపట్టారు. ఆ తర్వాత పి. చిదంబరంకు ఆ బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే.
స్మృతి ఇరానీకి షాక్:
కేంద్ర రైల్వేమంత్రి పీయూష్ గోయల్ కు అదనపు బాధ్యతలతో పాటు మంత్రివర్గంలో స్వల్ప మార్పులు చేశారు. సమాచార, ప్రసారాల శాఖ నుంచి స్మృతి ఇరానీని తప్పించి.. ఆ శాఖను రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ కి అప్పగించారు. స్మృతి ఇరానీని జౌళి శాఖ మంత్రిగానే కొనసాగనున్నారు. మరో కేంద్రమంత్రి ఆల్ఫోన్స్ కన్నథానమ్ను బాధ్యతల నుంచి తప్పించారు. ఆయన నిర్వర్తిస్తున్న ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ పదవులను ఎస్ఎస్ అహుల్ వాలియాకు అప్పగించారు.












Click it and Unblock the Notifications