జల్లికట్టుపై రాజ్ వద్దకు ఎంపీలు, త్వరలో ముగింపు.. కేంద్రమంత్రి
తమిళనాడులో అధికార పార్టీ అన్నాడీఎంకే ఎంపీలు శుక్రవారం నాడు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో భేటీ అయ్యారు. జల్లికట్టు నిర్వహణ అంశంపై వారు చర్చించారు.
న్యూఢిల్లీ: తమిళనాడులో అధికార పార్టీ అన్నాడీఎంకే ఎంపీలు శుక్రవారం నాడు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో భేటీ అయ్యారు. జల్లికట్టు నిర్వహణ అంశంపై వారు చర్చించారు.
అనంతరం ఆ పార్టీ ఎంపీ, లోకసభ డిప్యూటీ స్పీకర్ ఎంతంబిదురై మాట్లాడారు. జల్లికట్టుకు మద్దతుగా ఆర్డినెన్స్ జారీ చేయాలని రాజ్నాథ్ సింగ్ను కోరినట్లు చెప్పారు. ఒకటి రెండు రోజుల్లో సమస్య పరిష్కారమవుతుందని రాజ్నాథ్సింగ్ హామీ ఇచ్చారన్నారు.
సెంటిమెంట్ చాలా ముఖ్యం: అనిల్ దవే
ఎవరి సెంటిమెంట్ అయినా తొలి ప్రాధాన్యం అని, సెంటిమెంటును గౌరవించాల్సిన అవసరముందని కేంద్రమంత్రి అనిల్ దవే శుక్రవారం అన్నారు. ఈ సాయంత్రానికి జల్లికట్టు విషయమై ఓ ముగింపు వస్తున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు.
కాగా, జల్లికట్టుకు పలువురు మద్దతు తెలుపుతున్న విషయం తెలిసిందే. రజనీకాంత్, పవన్ కళ్యాణ్, సూర్య, కమల్ హాసన్, విశాల్, విజయ్... తదితర నటులు జల్లికట్టుకు మద్దతు పలుకుతున్నారు.
జల్లికట్టుకు అనుకూలంగా ఉద్యమిస్తున్న ఆందోళనకారులకు మద్దతుగా నిలుస్తానని ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీ రవిశంకర్ గురువారం ప్రకటించారు. తమిళుల మనోభావాలను గౌరవించాల్సిన బాధ్యత ఉందన్నారు.
జల్లికట్టుకు మద్దతుగా యువత చేస్తున్న ఆందోళనలో పాల్గొని వారి క్రెడిట్ను తారలు పొందడం సముచితం కాదని నటుడు కమల్హాసన్ అభిప్రాయపడ్డారు. చెన్నైలో యువకులు చేపడుతున్న ఆందోళనల్లో పలువురు నటీనటులు, దర్శకులు పాల్గొంటున్న విషయం తెలిసిందే. దీనిపై కమల్ స్పందించారు.
తొలిసారిగా గర్వపడే స్థాయిలో యువత ఘనకార్యంలో నిమగ్నమైందన్నారు. సాధారణంగా యువకులను రాజకీయ నేతలు రెచ్చగొడతారని, అయితే ఇప్పుడు ఆ రాజకీయ నేతలే ఆశ్చర్యపోయేలా యువత రంగంలోకి దిగిందన్నారు.
సినీ ప్రముఖులు వారి ఆందోళనలో పాల్గొని ఆ క్రెడిట్ను పొందడం సముచితం కాదన్నారు. ఇది కేవలం యువకులకు దక్కాల్సిన విజయమని, రేపటి రాజకీయ నాయకులు పలువురు అందులో ఉండొచ్చని, వారి పోరాటాన్ని అడ్డుకునే అర్హత ఎవరికీ లేదన్నారు.