క్రికెటర్లను పోలీసులు అర్థరాత్రి లేపి విచారించారు
హైదరాబాద్, జమ్మూ కాశ్మీర్ మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. పోలీసులు తమ హోటల్కి వచ్చి తమను ప్రశ్నించిన తీరును జట్టు ఆల్ రౌండర్ షమీవుల్లా బేగ్ ఫేస్బుక్లో వివరించాడు. పోలీసులు అర్థరాత్రి హోటల్కి వచ్చారని, తమను గంటల కొద్దీ ప్రశ్నించారని, దాంతో తాము రాత్రంతా నిద్రపోలేకపోయామని అతను అన్నాడు.
హోటల్లో తమ రంజీ ట్రోఫీ ఆటగాళ్లు మాత్రమే ఉన్నందున తమ గదులకు తాము తలుపులు బిగించుకోలేదని, తాము దీర్ఘ నిద్రలో ఉన్న సమయంలో సాయుధ పోలీసులు తమ గదుల్లోకి వచ్చి తమను చుట్టిముట్టిన దిగ్భ్రాంతి నుంచి తాము ఇంకా కోలుకోలేకపోతున్నామని బేగ్ అన్నాడు.
తమకు అందిన సమాచారంతో జమ్మూలోని హోటళ్లను అన్నింటినీ గాలించామని, తాము క్రికెట్ జట్టును ప్రత్యేకంగా లక్ష్యం చేసుకోలేదని జమ్మూ ఇన్స్పెక్టర్ జనరల్ రాజేష్ కుమార్ అన్నారు. హోటల్లో రంజీ జట్టు క్రికెటర్లు ఉన్నట్లు తమకు ముందస్తు సమాచారం లేదని, దాంతో అన్ని హోటళ్లలో మాదిరిగానే ఆ హోటల్లో కూడా సోదాలు చేశామని, వారు రంజీ ట్రోఫీ జట్టు క్రికెటర్లని కూడా తమకు తెలియదని ఆయన వివరించారు.
సాధారణమైన తనిఖీయే అయినప్పటికీ తమ పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు సరిగా లేదని బేగ్ ఆగ్రహంగా అన్నాడు. జమ్మూ కాశ్మీర్ క్రికెట్ చరిత్రలో అత్యంత కీలకమైన మ్యాచ్ ఆడుతున్న జాతీయ, అంతర్జాతీయ కీర్తి కలిగిన క్రికెటర్ల పట్ల ఇలా వ్యవహరించడం సరి కాదని ఆయన అన్నాడు.