గాలి జనార్దన్ రెడ్డికి షరతులతో బెయిల్
బెంగళూరు: అక్రమ మైనింగ్ కేసులో అరెస్టు అయిన కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డికి సోమవారం ప్రత్యేక న్యాయస్థానం షరతులతో బెయిల్ మంజూరు చేసింది. తనకు బెయిల్ మంజూరు చెయ్యాలని గాలి జనార్దన్ రెడ్డి లోకాయుక్త ప్రత్యేక కోర్టులో అర్జీ సమర్పించారు.
సోమవారం అర్జీ విచారణ చేసిన న్యాయస్థానం రూ. 5 లక్షల బాండ్ లతో పాటు ఇద్దరు సెక్యూరిటి ఇస్తే బెయిల్ మంజూరు చేస్తామని న్యాయస్థానం చెప్పింది. అదే విధంగా బళ్లారి నగరంతో పాటు వేరే ప్రాంతాలకు వెళ్లరాదని న్యాయస్థానం సూచించింది.
బళ్లారికి వెళ్లాలంటే కచ్చితంగా న్యాయస్థానం అనుమతి తీసుకోవాలని కోర్టు స్పష్టం చేసింది. ఎస్ఐటి (సిట్) అధికారుల విచారణకు కచ్చితంగా హాజరుకావాలని ఆదేశాలు జారీ చేశారు. బ్లాక్ గోల్డ్ మైనింగ్ కంపెనీ పేరుతో అక్రమంగా 50,000 మెట్రిక్ టన్నుల ఇనుప ఖనిజం విక్రయించారని అధికారులు ఆరోపించారు.
గాలి జనార్దన్ రెడ్డి మీద ఇదే కేసు నమోదు అయ్యింది. విచారణకు హాజరుకావాలని సిట్ అధికారులు గాలి జనార్దన్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. ఈ నెల 20వ తేదిన ఎస్ఐటి కార్యాలయానికి హాజరైన గాలి జనార్దన్ రెడ్డిని అదే రోజు అరెస్టు చేశారు. ఈ కేసులో అరెస్టు అయిన పలువురికి బెయిల్ రాలేదు.