జనతా పరివార్ షాక్: వారికే లాభమని ఎస్పీ మెలిక, నితీష్ స్పందన
న్యూఢిల్లీ: కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ, ఎన్డీయే ప్రభుత్వానికి ధీటుగా ఒక్కటవుతామని చెప్పిన జనతా పరివార్లో ఆదిలోనే వ్యతిరేకత కనిపిస్తోంది. మూడు దశాబ్దాల క్రితం దేశాన్ని పరిపాలించిన జనతా పార్టీకి పూర్వవైభవం తెచ్చేందుకు దాని నుండి వేరుపడిన ఆరు ప్రధాన పార్టీలను విలీనం చేయాలన్న ప్రయత్నాలకు తొలి అడ్డంకి ఎదురైంది.
ఉత్తర ప్రదేశ్లో అధికారంలో ఉన్న సమాజ్వాదీ పార్టీ విలీనంపై మెలిక పెడుతోంది. బీహార్ ఎన్నికల్లోపు జనతా పరివార్ విలీనం అసాధ్యమని ఆ పార్టీ తేల్చి చెప్పింది.
పరివార్ విలీనం ప్రక్రియ సాంకేతిక అంశాల కారణంగా ప్రస్తుతానికి నిలిచిపోయిందని, బీహార్ ఎన్నికల్లోపు విలీనం దాదాపు అసాధ్యమేనని, ఒకవేళ అలాంటి ప్రక్రియ ఏదైనా చేపడితే, అది తమ పార్టీకి మరణశాసనమేనని సమాజ్వాదీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంగోపాల్ యాదవ్ ఆదివారం ధన్నారు.
ఈయన మాటల ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. జనతా పరివార్ విలీనం నీలినీడలు కమ్ముకున్నట్లేనని పలువురు భావిస్తున్నారు. కొత్త జనతాపార్టీ పతాకం, ఎన్నికల గుర్తు తదితరాల రూపకల్పనకు ఏర్పాటు చేసిన ఆరుగురు సభ్యుల కమిటీలో రాంగోపాల్ యాదవ్ కూడా ఉన్నారు. స్వయంగా ఆయనే, విలీనం సాధ్యం కాదని చెప్పడం గమనార్హం.
ఎస్పీ నేత వ్యాఖ్యలపై స్పందించిన శరద్ యాదవ్, ములాయంను తమ అధినేతగా ఎన్నుకున్నామని, ఏ ప్రకటన ఐనా చేసే అధికారం ఆయనదేనన్నారు. జనతా పరివార్ విలీనానికి, ఎస్పీ మోకాలడ్డడానికి పార్టీలో వ్యతిరేకతే కారణమని భావిస్తున్నారు.
బీహార్ ఎన్నికల్లోపు విలీనమైతే, ఆర్జేడీ, జేడీయూలకే లాభం తప్ప తమకు ఒరిగే ప్రయోజనమేదీ లేదని పార్టీ వర్గాలు విశ్లేషించుకుంటున్నాయి. పైగా, విలీనం వల్ల, దశాబ్దాలుగా ఉత్తరప్రదేశ్ ప్రజలందరికీ చిరపరిచితమైన పార్టీ ఎన్నికల గుర్తును కోల్పోయే ప్రమాదం ఉందని, దానివల్ల ఓటర్లు అయోమయానికి గురైతే, సొంత రాష్ట్రంలో తమ ఉనికికే ముప్పు వాటిల్లుతుందని ఎస్పీ నేతలు భావిస్తున్నారు.
మరోవైపు, రాంగోపాల్ యాదవ్ వ్యాఖ్యల పైన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సోమవారం స్పందించారు. జనతా పరివార్ పైన ఇప్పటికే నిర్ణయం తీసుకున్నామని, దీని పైన వెనక్కి వెళ్లే ప్రసక్తి లేదని చెప్పారు. రాంగోపాల్ యాదవ్ వ్యాఖ్యలపై మాట్లాడుతూ.. ఈ ప్రజాస్వామ్య దేశంలో ఎవరు ఏమైనా మాట్లాడవచ్చునని చెప్పారు.