మోదీ దుకాణంలో మందులు అగ్గువ -శానిటరీ ప్యాడ్ రూ.2.50కే: ప్రధాని; 7500వ జన ఔషధి కేంద్రం ప్రారంభం
రకరకా వ్యాధులతో బాధపడే పేద, మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరకే మందులు అందించాలనే ఉద్దేశంతో కేంద్రం తీసుకొచ్చిన జన ఔషధి పథకం అప్రతిహతంగా ముందుకు సాగుతున్నది ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. పేదలకు వరంగా మారిన జన ఔషధి కేంద్రాలను జనమంతా 'మోదీ దుకాణం' (మోదీకి దుకాన్)గా పిలుచుకోవడం ఆనందకరమని ప్రధాని అన్నారు.
జన ఔషధి దినోత్సవం సందర్భంగా ఆదివారం షిల్లాంగ్లో 7500వ కేంద్రాన్ని వీడియో కాన్ఫరెన్సు ద్వారా ప్రారంభించిన ప్రధాని మోదీ.. ఈ సందర్భంగా వినియోగదారులతో సంభాషించారు. దేశవ్యాప్తంగా 10వేల జనౌషధి కేంద్రాలను ఏర్పాటు చేయడమే కేంద్రం లక్ష్యంగా పెట్టుకుందని, ఈ కేంద్రాల ద్వారా పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఏడాదికి రూ.3,600 కోట్లు ఆదా అవుతుందని ప్రధాని తెలిపారు.

2014కు ముందు జన ఔషధి కేంద్రాల సంఖ్య వందలోపే ఉండేదని, బీజేపీ హయాంలో వాటి సంఖ్యను భారీగా పెంచామని, షిల్లాంగ్ లో ఏర్పాటైన జన ఔషధి కేంద్రం 7500వది కాగా, అతి త్వరలోనే 10వేల మార్కును చేరతామని ప్రధాని మోదీ చెప్పారు. ఈశాన్య రాష్ట్రాల్లో ప్రజా ఆరోగ్య కేంద్రాలు ఎలా విస్తరిస్తున్నాయో అని చెప్పడానికి జన ఔషధి కేంద్రాల ఏర్పాటు ఒక తార్కరణమన్నారు.

జన ఔషధి పథకం ద్వారా పేద, మధ్య తరగతి కుటుంబాలతో పాటు గిరిజన ప్రాంత ప్రజలకూ తక్కువ ఖర్చులో ఔషధాలు అందుతున్నాయని, అంతేకాకుండా యువతకు ఉపాధి కూడా లభిస్తోందని, ఈ కేంద్రాల వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయని, బాలికలకు కేవలం రూ.2.5లకే శానిటరీ న్యాప్కిన్స్ లభిస్తున్నాయని ప్రధాని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ప్రభావవంతమైన చికిత్స అందించడంలో భాగంగా మౌలిక సౌకర్యాల వృద్ధికి దృష్టి సారించిందని, జన ఔషధి కేంద్రాలను నిర్వహించే వారికి ఇచ్చే ప్రోత్సాహకాన్ని రూ.2.5లక్షల నుంచి రూ.5లక్షలకు పెంచేందుకు కేంద్రం కృషి చేస్తోందని మోదీ తెలిపారు.












Click it and Unblock the Notifications