కూటమి సర్కార్కు చుక్కలే..!!
హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల ప్రచార వేడి పతాక స్థాయికి చేరుకుంది. పోలింగ్ గడువు సమీపిస్తోన్న కొద్దీ బహిరంగ సభలు, రోడ్ షోలు హోరెత్తుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధినేత మల్లికార్జున్ ఖర్గే, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు.
అధికారాన్ని నిలబెట్టుకోవడానికి భారతీయ జనతా పార్టీ-జన్ నాయక్ జనతా పార్టీ సంకీర్ణ కూటమి, ఈ దఫా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే పట్టుదలతో కాంగ్రెస్ వ్యూహ ప్రతివ్యూహాలను రూపొందించుకున్నాయి. మొత్తం 90 నియోజకవర్గాలు ఉన్న అసెంబ్లీపై పట్టు సాధించడానికి తమ ప్రయత్నాలు ముమ్మరం చేశాయి.

ఒకే దశలో పోలింగ్ షెడ్యూల్ అయింది హర్యానాలో. అక్టోబర్ 5వ తేదీన పోలింగ్ జరుగనుంది. 8వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఇక్కడ పోల్ అయిన ఓట్లను కూడా అదే రోజున లెక్కిస్తారు. మొత్తం 90 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 73 జనరల్ సీట్లు. 17 స్థానాలు ఎస్సీ రిజర్వ్డ్.
మొత్తం 20.1 మిలియన్ మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో 10.6 మిలియన్ల మంది పురుషులు, 9.5 మిలియన్ల మంది మహిళలు ఉన్నారు. 4,52,000 మంది మొదటి సారిగా తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
కాగా- ఈ ఎన్నికల్లో మొత్తం 89 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు పోటీలో నిలిచారు. ఒక్క స్థానాన్ని మాత్రం మిత్రపక్షం సీపీఎంకు కేటాయించారు. పోలింగ్ గడువు సమీపిస్తోండటంతో సర్వేసంస్థలు తమ అంచనాలను వెల్లడిస్తోన్నాయి. ప్రీ పోల్ ఒపీనియన్ను బయటపెడుతున్నాయి.

ఈ పరిణామాల మధ్య జన్మత్ సంస్థ తన ఎన్నికల సర్వే అంచనాలను వెల్లడించింది. హర్యానాలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని అంచనా వేసింది. 90 నియోజకవర్గాలు ఉన్న అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మేజిక్ ఫిగర్.. 46. దీన్ని కాంగ్రెస్ పార్టీ అందుకుంటుందని అభిప్రాయపడింది.
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 49 నుంచి 51 స్థానాలు లభిస్తాయని జన్మత్ తెలిపింది. ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ ఈ సారి ప్రతిపక్ష పాత్రకు పరిమితం కావొచ్చని పేర్కొంది. ఈ కూటమికి 26 నుంచి 28 నియోజకవర్గాలు దక్కుతాయని వెల్లడించింది. ఇతరులు 11 నుంచి 13 స్థానాలు దక్కించుకుంటారని అంచనా వేసింది.












Click it and Unblock the Notifications