భూకంపాల్ని తట్టుకునే టెక్నాలజీ అడిగిన వెంకయ్య
న్యూఢిల్లీ: భూకంపాలను తట్టుకునే ఇళ్ల నిర్మాణానికి సాంకేతిక పరిజ్ఞానం ఇవ్వాలని తాను జపాన్ ప్రతినిధులను కోరానని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు మంగళవారం చెప్పారు. వెంకయ్య జపాన్ ప్రతినిధులతో మంగళవారం భేటీ అయ్యారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.
పట్టణాల్లో సౌకర్యాలు, పరిశుభ్రత, నీటిశుద్ధి పైన చర్చించామని తెలిపారు. భూకంపాలను తట్టుకునే ఇళ్ల నిర్మాణానికి టెక్నాలజీని ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. అక్టోబరు నెలలో తాను జపాన్ దేశంలో పర్యటిస్తానని అన్నారు. తక్కువ వడ్డీకి ఆర్థిక సాయం చేయాలని జపాన్ను కోరారు.
విజయవాడ - మెట్రో రైళ్ల అంశాల పైన కూడా తాను జపాన్ ప్రతినిధులతో చర్చించానని తెలిపారు. విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులకు, మెట్రో నగరాల్లో మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడంలో ఇరుదేశాల మధ్య సహకారం ఒప్పందం కుదిరే అవకాశముందని తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం ఇచ్చేందుకు జపాన్ ప్రతినిధులు సుముఖత వ్యక్తం చేశారన్నారు. 100 స్మార్ట్ సిటీల అభివృద్ధికి సహకరించేందుకు అంగీకరించారన్నారు.
కర్నాటకలో మోడీ పర్యటన
ప్రధానమంత్రి నరేంద్ర మోడి ఇవాళ, రేపు కర్నాటకలో పర్యటించనున్నారు. సాయంత్రం 5.40 గంటలకు హెచ్ఏఎల్ విమానాశ్రయానికి చేరుకుంటారు. ఆయనకు సీఎం సిద్ధరామయ్య స్వాగతం పలుకుతారు. 6.15కి బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతారు.
బుధవారం ఉదయం 6.45 గంటలకు పీణ్యలోని ఇస్రో కేంద్రానికి వెళ్తారు. 'మామ్'ను అంగారక కక్షలోకి ప్రవేశ పెట్టే ప్రక్రియను పరిశీలిస్తారు. అనంతరం పది గంటల సమయంలో తుమకూరు వెళ్తారు. అక్కడి సిద్ధగంగా మఠాన్ని సందర్శిస్తారు. అనంతరం తుమకూరులో ఫుడ్ పార్కును ప్రారంభిస్తారు.