విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జొవాద్: విశాఖపట్నానికి 250 కిలోమీటర్ల దూరంలో తుపాన్, ఆదివారం మధ్యాహ్నం పూరీ వద్ద తీరం దాటుతుందని అంచనా

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
ఎన్డీఆర్ఎఫ్ బృందాలు

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్రరూపం దాల్చడంతో ఉత్తరాంధ్ర, ఒడిశాలలో వర్షాలు ప్రారంభమయ్యాయి.

శుక్రవారం మధ్యాహ్నం నుంచి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి.

గంటకు 30 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న ఈ తీవ్ర వాయుగుండం శుక్రవారం రాత్రి 11.30 సమయానికి విశాఖపట్నం నుంచి దక్షిణ ఆగ్నేయంగా 250 కిలోమీటర్ల దూరంలో, పూరీకి 430 కిలోమీటర్ల దూరంలో ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

ఇది ఉత్తరాంధ్ర - ఒడిశా తీరాల దిశగా కదిలే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఆదివారం నాటికి ఇది పెను తుపానుగా మారి ఒడిశాలోని పూరీ సమీపంలో తీరం దాటొచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది.

దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలో ఒక మోస్తరు వర్షాల నుంచి అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవొచ్చని... తీరం వెంబడి 45 నుంచి 65 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు.

వాతావరణ హెచ్చరిక

చిరు జల్లులు

జొవాద్ ప్రభావంతో శుక్రవారం నుంచి ఉత్తరాంధ్రలో అక్కడక్కడ జల్లులు పడుతున్నాయి.

తుపాను నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో సహాయక చర్యలకోసం ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలు 11, ఎస్‌డీఆర్ఎఫ్ బృందాలు నాలుగు రంగంలోకి దిగాయని, అదనంగా మరో నాలుగు బృందాలు అందుబాటులో ఉన్నాయని ఏపీ విపత్తుల శాఖ కమిషనర్ కె.కన్నబాబు తెలిపారు.

మత్య్యకారులు ఆదివారం వరకు వేటకు వెళ్ళరాదని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఉత్తరాంధ్రపై తుపాను ప్రభావం తీవ్రంగా ఉంటుందన్న అంచనాల నేపథ్యంలో ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలు మూడు, ఎస్‌డీఆర్ఎఫ్ సిబ్బంది 45 మంది సహాయ చర్యల కోసం సిద్ధంగా ఉన్నారని విశాఖ కలెక్టర్ మల్లికార్జున చెప్పారు.

ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బలగాలు విశాఖ నగరంలోని కైలాసగిరి దగ్గర రోడ్ మార్చ్ నిర్వహించాయి. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని హెచ్చరించాయి.

100 మందితో కూడిన 5 ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలు విశాఖ జిల్లాలో సహాయ చర్యల కోసం సిద్ధంగా ఉన్నాయి.

విశాఖ నగరం పరిధిలో 21 తుపాను పునరావాస కేంద్రాలు అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు.

మండలాల అధికారులతో వైర్‌లెస్ సెట్లో మాట్లాడుతున్న శ్రీకాకుళం కలెక్టర్

జలాశయాల పరిస్థితి పరిశీలిస్తున్న అధికారులు

విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలోని రిజర్వాయర్లు, డ్యాంలను అధికారులు పరిశీలిస్తున్నారు.

భారీ వర్షాలకు జలాశయాలు నిండితే నీటిని విడుదల చేయడానికి ఇరిగేషన్ అధికారులు, సిబ్బంది సిద్ధంగా ఉన్నారు.

ఉత్తరాంధ్ర మూడు జిల్లాలలో శుక్ర, శనివారాలు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.

తుపాను సహాయ చర్యల కోసం నేవీ, కోస్ట్ గార్డ్ కూడా సిద్ధంగా ఉంది. నేవీ హెలికాప్టర్లతో సన్నద్ధమైంది.

తుపాను తీవ్ర రూపందాల్చితే శ్రీకాకుళం జిల్లాలోని 11 తీర ప్రాంత మండలాలు, 237 వరద ప్రభావిత గ్రామాలపై ప్రభావం ఉండొచ్చన్న అంచనాలతో ముందస్తు చర్యలు చేపడుతున్నారు.

3 ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలు, ఒక ఎస్‌డీఆర్ఎఫ్ బృందాన్ని సహాయ చర్యల నిమిత్తం శ్రీకాకుళం జిల్లాకు కేటాయించారు. జిల్లాలో 45 పునరావాస కేంద్రాలను సిద్ధం చేసినట్లు కలెక్టర్ శ్రీకేశ్ లాఠ్కర్ తెలిపారు.

విద్యుత్ ప్రమాదాలు జరిగితే ఈ నంబర్లకు ఫోన్ చేయండి

జొవాద్ తుపాన్ వల్ల విద్యుత్ ప్రమాదాలు జరిగినా, అవాంతరాలు ఏర్పడినా సమాచారం కోసం ఏపీ ఈపీడీసీఎల్ కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసింది.

తుపాన్ ప్రభావానికి తెగిపడిన విద్యుత్ వైర్లు, పడిపోయిన విద్యుత్ స్తంభాలు, విద్యుత్ లైన్లపై పడిపోయిన చెట్లకొమ్మల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అలాంటి టోల్ ఫ్రీ నంబర్ 1912కి కానీ, కంట్రోలు రూమ్‌లకు ఫోన్ చేసి కానీ చెప్పాలని ఏపీఈపీడీసీఎల్ సీఎండీ కె.సంతోషరావు కోరారు.

కంట్రోలు రూమ్ ఫోన్ నెంబర్లు

విశాఖపట్నం కార్పోరేట్ ఆఫీసు- 9440816373 / 8331018762

శ్రీకాకుళం- 9490612633

విజయనగరం- 9490610102

విశాఖపట్నం- 7382299975

తూర్పుగోదావరి- 7382299960

పశ్చిమగోదావరి - 9440902926

https://www.facebook.com/BBCnewsTelugu/videos/420451349565589

పాఠశాలలకు సెలవులు, పలు రైళ్లు రద్దు

తుపాను హెచ్చరికల నేపథ్యంలో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలోనూ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలకు రెండు రోజులు సెలవులు ప్రకటించారు.

ప్రభుత్వ సిబ్బందికి జిల్లాల కలెక్టర్లు సెలవులు రద్దు చేశారు. శనివారం ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు ఒకరోజు సెలవు ఇస్తున్నట్లు తూర్పు గోదావరి కలెక్టర్‌ హరికిరణ్‌ తెలిపారు.

ఉత్తరాంధ్రపై ఎక్కువ ప్రభావం ఉండే అవకాశం ఉండటంతో విజయనగరం, విశాఖ, శ్రీకాకుళం జిల్లాల కలెక్టర్లు రంగంలోకి దిగారు.

ప్రభుత్వ ఉద్యోగులంతా అందుబాటులో ఉండాలని ఆదేశించారు. తీర ప్రాంత మండలాలకు ప్రత్యేక అధికారులను నియమించారు.

ఈ నెల 3 నుంచి 5 వరకు విశాఖపట్నంలోని అన్ని పర్యాటక ప్రాంతాలను మూసివేస్తున్నట్లు కలెక్టర్ మల్లికార్జున ప్రకటించారు. ఇవాళ (శుక్రవారం) బయలుదేరే పలు రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.

సీఎం సమీక్ష... నేవీ సిద్ధం

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో అవసరాన్ని బట్టి సహాయ శిబిరాలు ఏర్పాటు చేయాలని సీఎం జగన్‌ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.

తుపాను సన్నద్ధతపై శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల కలెక్టర్లతో సమీక్షించారు. లోతట్టు, ముంపు ప్రాంతాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, తుపాను కారణంగా ఉత్పన్నమయ్యే పరిస్థితుల వల్ల ఏ ఒక్కరూ ఇబ్బంది పడకుండా చూడాలని ఆదేశించారు.

తుపాను అప్రమత్తతపై ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు చర్చించారు.

సముద్రం

https://twitter.com/ANI/status/1466355716612968454

ఒడిశాలోని నాలుగు జిల్లాల్లో రెడ్ అలర్ట్

జవాద్ తుపాను హెచ్చరికల నేపథ్యంలో ఒడిశాలోని నాలుగు జిల్లాలకు భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరో ఏడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

డిసెంబర్ 4న తీర ప్రాంతాల్లో 60 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ఐఎండీ సైంటిస్ట్ ఉమాశంకర్ దాస్ చెప్పారు. జనం ఇళ్లలోనే ఉండాలని సూచించారు.

వాయుగుండం తుపానుగా మారే అవకాశం ఉందన్న అంచనాల నేపథ్యంలో తాజా పరిస్థితులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం సమీక్షించారు.

''రానున్న మూడు రోజుల్లో పరిస్థితులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సమాచారం అందించాం. సహాయక చర్యల ఏర్పాట్లను హోంశాఖ కార్యదర్శి వివరించారు. ప్రభావిత ప్రాంతాల్లో 29 బృందాలను మోహరించాం'' అని జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్‌డీఆర్‌ఎఫ్) డీజీ అతుల్ కర్వాల్ చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Jawad: Cyclone 250 km from Visakhapatnam is expected to cross the coast at Puri on Sunday afternoon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X