జయలలిత మృతి మిస్టరీ-తమిళనాడు సీఎంకు ఆర్ముగస్వామి కమిషన్ నివేదిక-ఏముందంటే ?
తమిళనాడు మాజీ సీఎం జయలలిత అనుమానాస్పద మృతిపై విచారణ జరుపుతున్న జస్టిస్ ఆర్ముగ స్వామి కమిషన్ ఇవాళ సీఎం ఎంకే స్టాలిన్ కు తమ నివేదిక సమర్పించింది. మాజీ సీఎం జయలలిత ఏ పరిస్ధితుల్లో ఆస్పత్రిలో చేరారు, అనంతరం ఆమెకు జరిగిన చికిత్స, మరణం వరకూ చోటు చేసుకున్న పరిణామాలపై విచారణ జరిపిన కమిషన్.. ఈ నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.
2017లో జయలలిత మరణంపై విచారణ కోసం అప్పటి పళనిస్వామి నేతృత్వంలోని అన్నాడీఎంకే సర్కార్ మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆర్ముగస్వామి ఆధ్వర్యంలో కమిషన్ ను నియమించింది. ఈ కమిషన్ విచారణ నివేదిక సమర్పించేందుకు గడువును ఏకంగా 14 సార్లు పొడిగించారు. చివరికి ఈ నెల 4న కూడా మరో పొడిగింపు కూడా ఇచ్చారు. ఎట్టకేలకు కమిషన్ ఇవాళ తన నివేదికను సీఎం స్టాలిన్ కు సమర్పించింది. సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసిన జస్టిస్ ఆరుముఖస్వామి 150 మందికి పైగా సాక్షులను విచారించి 600 పేజీల నివేదికను సమర్పించారు. ఈ నివేదికను ఇంగ్లీష్, తమిళంలో అందజేశారు.
ఈ నివేదికలో జయలలితకు అందించిన చికిత్సలో అపోలో హాస్పిటల్స్కు క్లీన్ చిట్ ఇస్తూ ఆర్ముఘస్వామి కమీషన్కు వైద్య నివేదికలతో సహాయం చేయడానికి ఏర్పాటైన ఎయిమ్స్ మెడికల్ ప్యానెల్ గతంలో తన నివేదికను సమర్పించింది దాని తుది నిర్ధారణతో ఏకీభవించింది. ఈ నేపథ్యంలో ఆర్ముగస్వామి కమిషన్ కూడా ఇదే అంశాలతో నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది. నివేదికలో పూర్తి అంశాలు బహిర్గతం కాకపోయినా జయలలితకు అందిన చికిత్స విషయంలో ఎలాంటి పొరబాట్లు జరగలేదని క్లీన్ చిట్ ఇచ్చినట్లు మాత్రం తెలుస్తోంది.