చివరి శ్వాస వరకు: నమ్మకం వమ్ము కాలేదని కార్యకర్తలతో 'అమ్మ'
చెన్నై: గురువారం తమిళనాడు ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. 234 అసెంబ్లీ స్థానాలున్న తమిళనాడు రాష్ట్రంలో ముఖ్యమంత్రి జయలలిత పార్టీ అన్నాడీఎంకే 133 స్థానాలను కైవసం చేసుకుని (ఇంకా ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా ఉండటంతో చెన్నైలోని జయలలిత నివాసం పోయెస్ గార్డెన్కు ఆ పార్టీకి చెందిన కార్యకర్తలు భారీగా తరలివస్తున్నారు.
రెండోసారి అధికారం చెపట్టనున్న జయలలతి ఈనెల 16వ తేదీన ఓటు వేసిన అనంతరం అభిమానులకు, కార్యకర్తలతో పాటు అన్నాడీఎంకే మంత్రులకు కూడా దర్శనమవ్వని సంగతి తెలిసిందే. పోలింగ్ రోజున వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఆమెకు వ్యతిరేకంగా రావడంతో ఆమె ఇంటికి పరిమితమయ్యారు.
అయితే ఈరోజు వెల్లడైన ఎన్నికల ఫలితాల్లో అన్నాడీఎంకే పార్టీ ఘన విజయం సాధించి చరిత్ర సృష్టించింది. అన్నాడీఎంకే వ్యవస్థాపక అధ్యక్షుడు ఎంజీఆర్ మాదిరి వరుసగా రెండోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించనున్నారని తెలిసి ఆమె కార్యకర్తలకు తన సందేశాన్ని వినిపించారు.

ఈ సందర్భంగా జయలలిత ఎన్నికల్లో తప్పుడు ప్రచారాన్ని నిర్వహించిన డీఎంకే ఓటమి పాలైందన్నారు. మన ప్రత్యర్థులైన డీఎంకే కుటుంబ రాజకీయాలను తమిళనాడు ప్రజలు తిరస్కరించారన్నారు. తనపై నమ్మకం పెట్టుకుని రెండోసారి తనకు ముఖ్యమంత్రి అవకాశాన్నిచ్చిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు.
ప్రజలపై తాను పెట్టుకున్న నమ్మకం వమ్ము కాలేదన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తానని స్పష్టం చేశారు. తన చివరి శ్వాస వరకు రాష్ట్ర అభివృద్ధికై పోరాడుతానని తెలిపారు. ఏఐఏడీఎంకే రెండోసారి విజయం సాధించడం సంతోషంగా ఉందన్నారు. పార్టీ విజయం కోసం పని చేసిన ఏఐఏడీఎంకే నేతలకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.
తనను చూసేందుకు, అభినందనలు తెలిపేందుకు వేలాది మంది కార్యకర్తలు, అభిమానులు పోయిస్ గార్డెన్ ముందుకు చేరుకుని సందడి చేస్తున్నారు. జయలలిత మాత్రం పూర్తి ఫలితాలు వెల్లడైన తరువాతనే బయటకు వస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అప్పటి వరకు ఎన్నికల ఫలితాల సరళిని ఆమె ఇంట్లో నుంచే విశ్లేషిస్తారని ఆయా పార్టీల వర్గాలు వెల్లడించాయి.
సాధారణంగా తమిళనాడులో ఐదేళ్లకోసారి ప్రభుత్వాన్ని మార్చే సంప్రదాయం కొనసాగుతోంది. కానీ ఈసారి జయలలిత ఆ సంప్రదాయాన్ని తిరగరాసారు. తమిళనాడులో అన్నాడీఎంకే చీఫ్ జయలలిత వరుసగా రెండోసారి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టనున్నారు. స్థానిక టీవీ ఛానల్స్ వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా అన్నాడీఎంకే మెజార్టీ దిశగా దూసుకెళ్తోంది.
కాగా, తమిళనాడు ఎన్నికల్లో విజయం సాధించినందుకు గాను ప్రధాని నరేంద్రమోడీ జయలలితకు స్వయంగా ఫోన్ చేసి ఆమెతో మాట్లాడారు. దీంతో ప్రధాని అభినందనలను స్వీకరించి ఆయనకు కృతజ్ఞతలు తెలిపారని పార్టీ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. 1984 తర్వాత అంటే, 32 ఏళ్ల తర్వాత తమిళనాడులో వరుసగా రెండోసారి ఒక ముఖ్యమంత్రి అధికారం చేపట్టడం ఇదే మొదటిసారి.












Click it and Unblock the Notifications