పునర్జన్మ ఎత్తా, ప్రజల ప్రార్థనల వల్లే: జయలలిత
చెన్నై: తమిళనాడు ఉప ఎన్నికల్లో తమ అన్నాడియంకె అభ్యర్థులకు ఓటు వేయాలని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజల ప్రార్థనల ఫలితంగా తాను పునర్జన్మ ఎత్తినట్లు తెలిపారు. ఈ మేరకు జయలిలత చేసిన ప్రకటన ఆదివారం విడుదలైంది.
ఎంజీఆర్ తనను రాజకీయాల్లోకి తెచ్చారని, దాని వల్ల తాను ప్రజల కోసం పనిచేస్తున్నానని, తన కోసం చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నట్లు తాను విన్నానని అంటూ మిమ్మల్ని నేను వదులుకోలేనని అన్నారు.
"మీ ప్రేమను పొందిన నాకు ఏ ప్రమాదం కూడా ముంచుకు రాదు" అని ఆమె అన్నారు. పూర్తిగా కోలుకుని, ప్రజల కోసం తాను పని చేయడానికి నిరీక్షిస్తున్నానని జయలలిత ఆ ప్రకటనలో అన్నారు.
అరవరంకురిచి, తిరుపరంకుద్రం, పాండిచ్చేరి, తంజావూరు ఉప ఎన్నికల్లో అన్నాడియంకెకు ఓటు వేయాలని జయలలిత తమిళనాడు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తాను ప్రత్యక్షంగా వచ్చి ప్రచారం చేయలేకపోతున్నానని, అయితే తన హృదయం మాత్రం అక్కడే ఉందని ఆమె అన్నారు.
ఉప ఎన్నికల్లో అన్నాడియంకె అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలిచే విధంగా కృషి చేయాలని ఆమె పార్టీ కార్యకర్తలకు, పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. భారీ మెజారిటీతో అన్నాడియంకె అభ్యర్థుల విజయం కోసం తాను ఆసక్తితో ఎదురు చూస్తున్నానని ఆమె చెప్పారు.