జయ లేఖ: రూ.940 కోట్ల సాయం ప్రకటించిన మోడీ
న్యూఢిల్లీ: తమిళనాడు వరద బాధిత ప్రాంతాలకు తక్షణ సహాయం కింద కేంద్రం రూ.940 కోట్ల సహాయాన్ని ప్రకటించింది. ఆ నిధులను వెంటనే విడుదల చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశించారు. వరద బాధితుల కోసం రూ.2వేల కోట్లు సహాయం చేయాలని తమిళనాడు సీఎం జయలలిత సోమవారం ఉదయం ప్రధాని మోడీని ఓ లేఖలో కోరారు.
ఆ లేఖకు స్పందించిన ప్రధాని తక్షణం సహాయ నిధులను విడుదలచేయాలంటూ ఆదేశించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల కడలూరు, కంచీపూరం, చెన్నై, తిరువల్లూరు జిల్లాలు దారుణంగా దెబ్బతిన్నాయి.
నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్, కేంద్ర నిధులను వరద బాధితులకు తక్షణం విడుదల చేయాలంటూ లేఖలో జయలలిత.. ప్రధానిని కోరారు. తుఫాను సాయం కింది రూ.2వేల కోట్లు తక్షణం అందించాలని కోరారు.
లేఖతో పాటు భారీ వర్షాలకు జరిగిన నష్టం, కోలుకోవడానికి కావాల్సిన నిధుల వివరాలతో కూడిన వినతి పత్రాన్ని కూడా జత చేశారు. ఈ నేపథ్యంలో తక్షణ సాయం కింద రూ.940 కోట్లు కేంద్రం విడుదల చేసింది.
కాగా, ప్రస్తుతం ప్రధాని మోడీ మలేషియా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. సింగపూర్ పర్యటన తర్వాత భారత్ తిరిగి రానున్న మోడీ.. శీతాకాల సమావేశాల దృష్ట్యా బుధవారం అఖిల పక్ష సభ్యలతో పార్లమెంట్లో సమావేశంకానున్నారు.