జయలలిత కేసు: కోర్టు విచారణకు రూ. 5.11 కోట్లు ఖర్చు
బెంగళూరు: తమిళనాడు ముఖ్యమంత్రి కుమారి జయలలిత అక్రమ ఆస్తుల కేసు దర్యాప్తు కోసం కర్ణాటక ప్రభుత్వం రూ. 5.11 కోట్లు ఖర్చు చేసిందని అధికారులు లెక్కలు చూపిస్తున్నారు. ఈ లెక్కలను తమిళనాడు ప్రభుత్వానికి పంపించి బిల్లు వసూలు చెయ్యాలని సిద్దమవుతున్నారు.
19 సంవత్సరాల క్రితం జయలలిత మీద అక్రమాస్తుల కేసు నమోదు అయ్యింది. ఇదే కేసులో మరో ముగ్గురు పేర్లు ఉన్నాయి. ఈ కేసు తమిళనాడులో విచారణ చెయ్యరాదని, జయలలిత సీఎంగా ఉన్నారని వ్యతిరేకిస్తూ అప్పట్లో డీఎంకే కోర్టును ఆశ్రయించింది.
పిటిషన్ కు స్పందించిన సుప్రీం కోర్టు కేసు విచారణ బెంగళూరుకు బదిలీ చేస్తున్నామని 2003 నబంబర్ 13వ తేదిన ఆదేశాలు జారీ చేసింది. అప్పటి నుండి బెంగళూరులోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో కేసు విచారణ జరిగింది. కర్ణాటక హై కోర్టులో జయలలిత కేసు కొట్టి వేశారు.
ఈ కేసు విచారణ 12 సంవత్సరాల పాటు బెంగళూరులో జరిగిందని, అందుకు రూ. 5.11 కోట్లకు పైగా ఖర్చు అయ్యిందని కర్ణాటక హోం శాఖ అధికారులు లెక్కలు చూపిస్తున్నారు. అదే విధంగా జయలలిత బెంగళూరు వచ్చిన సమయంలో అయిన సెక్యూరిటి ఖర్చులను వసూలు చెయ్యాలని భావిస్తున్నారు.
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కేసు విచారణ సందర్బంగా అయిన ఖర్చుల వివరాల లెక్కలు సిద్దం అవుతున్నాయని, ఆ బిల్లును తమిళనాడుకు పంపించాలని తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని కర్ణాటక న్యాయ శాఖ మంత్రి టీ.బి. జయచంద్ర తెలిపారు.