పన్ను ఎగవేత కేసు: రాజీ బాట తొక్కిన జయలలిత
చెన్నై: కేసుల భయం వెన్నాడుతున్న అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఇప్పుడు రాజీ బాట పట్టారు. ఇందులో భాగంగా, ఆదాయ పన్ను ఎగవేతకు సంబంధించి ఎగ్మూరు కోర్టులో విచారణలో ఉన్న కేసును ఆమె ఆదాయ పన్ను శాఖతో రాజీ కుదుర్చుకున్నారు. దాదాపు రెండు దశాబ్దాల కిందట వరుసగా రెండేళ్లపాటు (1991-92, 1992-93) జయలలిత, ఆమె సన్నిహితురాలు శశికళకు చెందిన జయ పబ్లికేషన్, శశి ఎంటర్ప్రైజస్లు ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేయలేదు.
దీంతో వారిద్దరూ ఆదాయ పన్ను ఎగవేతకు పాల్పడినట్లు ఆరోపిస్తూ ఆదాయ పన్ను శాఖ ఇద్దరిపైనా క్రిమినల్ కేసు దాఖలు చేసింది. కేసు విచా రణ నిమిత్తం పలుమార్లు కోర్టుకు హాజరు కావాల్సిందిగా జయను కోర్టు ఆదేశించినా, వాయిదాలు కోరు తూ వచ్చారు. దీనిపై సామరస్యంగా పరిష్కరించుకునే సౌలభ్యాన్ని సుప్రీం సూచించింది. కోర్టు బయటే పన్ను చెల్లింపులకుసంబంధించి సెటిల్మెంట్ చేసుకోవచ్చని కూడా సుప్రీంకోర్టు సూచించింది.
ఈ నేపథ్యంలోనే తాము ఎగవేసినట్లు ఐటీ శాఖ పేర్కొన్న బకాయి మొత్తాన్ని జయ శుక్రవారం చెల్లించినట్లు సమాచారం. దీంతో ఆ కేసు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. జయలలిత తరఫు విజ్ఞప్తిని అంగీకరించిన ఢిల్లీలోని ఆదాయం పన్ను శాఖ ప్రత్యేక కమిషన్ కేసు ఉపసంహరణకు సానుకూలంగా ప్రతిస్పందించినట్లు సమాచారం.
సామరస్యపూర్వకంగా సమస్య పరిష్కారం కావడంతో ఆ విషయాన్ని కోర్టు దృష్టికి ఆదాయం పన్ను శాఖ తెస్తుంది. వరమో వారంలో ఎగ్మూర్ కోర్టు ముందు తమ వాదన వినిపించనుంది. ఆ తర్వాత జయలలితకు ఈ కేసులో ఊరట కలిగించే విధంగా కోర్టు ఆదేశాలు వస్తాయని భావిస్తున్నారు.