శశికళకు పదవికి సుప్రీం తీర్పు గండం ? అదే జరిగితే జైలులో !
న్యూఢిల్లీ/చెన్నై: జయలలిత అక్రమాస్తుల కేసులో శశికళ నటరాజన్ కూడా సహ నిందితురాలు. సుప్రీం కోర్టులో విచారణ పూర్తి అయిన ఈ కేసు తీర్పు మరో వారం రోజుల్లో వెలువడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో శశికళ నటరాజన్ సీఎం పదవి చేపడితే గండం వస్తుందని న్యాయనిపుణలు అంటున్నారు.
జయలలిత అక్రమాస్తుల కేసులో శశికళ, ఆమె తమ్ముడు జయరామన్ భార్య ఇళవరసి తదితరతులు నిందితులుగా ఉన్నారు. ప్రత్యేక కోర్టు జయలలిత, శశికళ, ఇళవరసి తదితరులకు జైలు శిక్ష విధించింది. ప్రత్యేక కోర్టు తీర్పు అనంతరం జయలలిత సీఎం పదవికి రాజీనామా చేసి పన్నీర్ సెల్వంకు బాధ్యతలు అప్పగించారు.

అయితే కర్ణాటక హై కోర్టు మాత్రం అందరిని నిర్దోషులుగా విడుదల చేసింది.తరువాత హైకోర్టు తీర్పును అప్పీలు చేస్తూ కర్ణాటక ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఇప్పటికే ఈ కేసు విచారణ పూర్తి అయ్యింది. కేసు తీర్పును న్యాయస్థానం రిజర్వులో పెట్టింది.
ఇప్పుడు శశికళకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో తీర్పు వస్తే దోషిగా ఉన్న చిన్నమ్మ సైతం పదవి నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అదే జరిగితే శశికళ చేపట్టే సీఎం పదవి మూడునాళ్ల ముచ్చటగానే మిగిలిపోతుంది. మళ్లీ పన్నీర్ సెల్వం సీఎం అయ్యే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications