జయలలితకు బెయిల్, 2నెలలు ఇంట్లోనే, స్వామి ఇలా..
న్యూఢిల్లీ: అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు సుప్రీం కోర్టులో శుక్రవారం షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ లభించింది. జయకు బెయిల్ లభించడంతో తమిళనాడులో అన్నాడీఎంకే వర్గాలు సంబరాలు చేసుకుంటున్నాయి. జయకు బెయిల్ మంజూరుచేసిన సుప్రీం కోర్టు.. కింది కోర్టు విధించిన శిక్షపై తాత్కాలిక స్టే విధించింది. జయలలిత తరఫున నారీమన్ వాదనలు వినిపించారు. జయలలితకు జస్టిస్ దత్తు, మదన్ బి లోకూర్లతో కూడిన ధర్మాసనం డిసెంబర్ 18 వరకు బెయిల్ ఇచ్చింది. ఆ లోగా పేపర్ బుక్తో హైకోర్టులో అప్పీలుకు సిద్ధం కావాలని సుప్రీం సూచించింది.
రెండు నెలల గడువు ఇచ్చామని, ఆ తర్వాత ఒక్కరోజు కూడా గడువు ఇవ్వమని కోర్టు తేల్చి చెప్పింది. అలాగే శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా చూడాలని ఆదేశించింది. ఏదైనా జరిగితే తీవ్రంగా పరిగణిస్తామని తెలిపింది. ఈ సందర్భంగా జయలలిత.. తాను ఈ రెండు నెలలు ఇంటికే పరిమితం అవుతానని సుప్రీంకు హామీ ఇచ్చారు. హైకోర్టులో వాయిదాలు అడగనని చెప్పారు. జయతో పాటు శశికళ, ఇళవరసన్, సుధాకరన్లకు కూడా బెయిల్ లభించింది.
సుబ్రహ్మణ్య స్వామి స్పందన
జయలలితకు బెయిల్ మంజూరు కావడంతో భారతీయ జనతా పార్టీ ముఖ్యనేత సుబ్రహ్మణ్య స్వామి స్పందించారు. అనారోగ్యం కారణంగానే బెయిల్ వచ్చిందని తెలిపారు. న్యాయస్థానం షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ ఇచ్చిందన్నారు. ఇది సాధారణ బెయిల్ అయినందున తాను అభ్యంతరం చెప్పలేదన్నారు.
జైలు వద్ద సంబరాలు
జయలలితకు బెయిల్ వచ్చిందని తెలియడంతో ఆమె ఉంటున్న బెంగళూరులోని పరప్పణ అగ్రహార జైలు వద్దకు భారీ ఎత్తున అమ్మ అభిమానులు, పార్టీ కార్యకర్తలు తరలి వచ్చారు. ఇరవై రోజుల తర్వాత అధినేత్రి బయటకు వస్తున్న ఆనందం వారిలో కనిపిస్తోంది. మరోవైపు కర్నాటక ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది.
జయలలిత సెప్టెంబర్ 27వ తేదీ నుండి జైలులో ఉంటున్నారు. పద్దెనిమిదేళ్ల కిందటి ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయలలితకు కర్నాటక కింది కోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష, వంద కోట్ల జరిమానా విధించిన విషయం తెలిసిందే. దీనిని సవాల్ చేస్తూ జయలలిత హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టు జయలలితకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది.
దీంతో జయలలిత సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీం కోర్టులో జయలలిత తరఫున ప్రముఖ న్యాయవాది నారీమన్ వాదనలు వినిపించారు. ఆయన హెల్త్ గ్రౌండ్లో వాదనలు వినిపించారు. శుక్రవారం అన్నాడీఎంకే పార్టీ 43వ వ్యవస్థాపక దినోత్సవం. పార్టీ వ్యవస్థాపక దినోత్సవం రోజే జయకు బెయిల్ రావడంతో పార్టీ వర్గాలు ఉద్వేగానికి లోనవుతున్నాయి.
జయకు సుప్రీం కోర్టులో బెయిల్ మంజూరయిన విషయం తెలియగానే తమిళనాడు, చెన్నైలో అన్నాడీఎంకే పార్టీ వర్గాలు సంబరాలు చేసుకుంటున్నారు. మిఠాయిలు పంచుకుంటున్నారు. బాణసంచా పేల్చుతున్నారు. జయ బెయిల్ పిటిషన్ పైన తీర్పు నేపథ్యంలో ఢిల్లీకి పెద్ద ఎత్తున అమ్మ అభిమానులు తరలి వచ్చారు.