జైల్లో దూప్ స్టిక్స్ చుడుతున్న మాజీ సీఎం జయలలిత
బెంగళూరు: అక్రమాస్తుల కేసులో అరెస్టై బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో ఉన్న అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు దూప్ స్టిక్స్ చేసే పనిని జైలు అధికారులు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. జయలలిత బెయిల్ కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఆమె తరపు న్యాయవాదులు కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో గత నెల 29న కర్ణాటక హైకోర్టు జయకు నాలుగేళ్ల జైలు శిక్ష, రూ.వంద కోట్ల జరిమానా విధించింది. ఆ వెంటనే ఆమె బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నా కర్ణాటక కోర్టు తిరస్కరించండతో ఆమె సుప్రీం కోర్టును ఆశ్రయించారు. జయలలిత సన్నిహితురాలు శశికళ, ఇళవరసులు కూడా సుప్రీం కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
కాగా, అక్రమాస్తుల కేసులో అరెస్టై కర్నాటక రాజధాని బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో ఉన్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత.. జైలులో ఏం పని చేయాలనే విషయం అధికారులు కొద్ది రోజుల క్రితం ఆమెకే వదిలేసినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
టైలరింగ్ సెక్షన్ లేదా కూరగాయలు కోయడం లేదా మరొకటి జయ ఏం చేయాలనుకుంటే అది చేయవచ్చునని జైలు అధికారులు సూచించారని సమాచారం. అయితే, తన ఆరోగ్యం దృష్ట్యా జైలు పని నుండి మినహాయింపు పొందాలని జయలలిత భావించారని వార్తలు వచ్చాయి. అయితే, ఆమెకు దూప్ స్టిక్స్ చుట్టే పనిని అప్పగించినట్లుగా తెలుస్తోంది.
ఇదిలా ఉండగా.. జయలలిత ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హైదరాబాద్లో ఆమెకున్న ద్రాక్ష తోటలే కీలకమయ్యాయి. ఆమెకు శిక్షపడటంలో రంగారెడ్డి జిల్లా జీడిమెట్లలో ఉన్న ద్రాక్ష తోటల ఆదాయమే ముఖ్యపాత్ర పోషించినట్లు తెలుస్తోంది. జయలలితకు జీడిమెట్లలో 14.50 ఎకరాల వ్యవసాయ క్షేత్రం ఉంది. అందులో ద్రాక్ష తోటల ద్వారా 1991-96 మధ్య రూ. 50.50లక్షల ఆదాయం వచ్చిందని ఆమె ఆదాయపు పన్నుశాఖకు లెక్కలు సమర్పించారు.

అయితే ప్రాసిక్యూషన్ విచారణలో ఈ లెక్కంతా తప్పుల తడకగా తేలింది. ప్రత్యేక న్యాయస్థానం కూడా ఈ వాదనతో ఏకీభవించింది. జయ సమర్పించిన పత్రాల ఆధారంగా తమిళనాడు నిఘా, అవినీతి నిరోధక అధికారులు దర్యాప్తు చేశారు. అప్పట్లో రంగారెడ్డి జిల్లాలో ఉద్యాన విభాగాధికారులుగా పనిచేసిన ఆర్ లత, పి కొండారెడ్డి, వ్యవసాయ వర్సిటీ అధికారులతోనూ ఆ క్షేత్రాన్ని తనిఖీ చేయించారు.
వీరితోపాటు 1993లో ఆ ప్రాంత ఆదాయ పన్ను విభాగం డిప్యూటీ కమిషనర్ ఇచ్చిన నివేదికలు కూడా కేసులో కీలకమయ్యాయి. 14.50 ఎకరాల క్షేత్రంలో పది ఎకరాల్లోనే వ్యవసాయం చేసినట్లు తేలింది. మిగిలిన భూమిని వ్యవసాయేతరాలకు వినియోగించినట్లు వెల్లడైంది. అందులోనూ కేవలం ఐదు ఎకరాల్లోనే ద్రాక్ష తోటలు సాగయినట్లు అధికారులు తేల్చారు. రెండు రకాలైన ద్రాక్ష సాగు ద్వారా జయలలిత చెప్పినంత ఆదాయం వచ్చే ప్రసక్తే లేదని తెలిపారు.
ఆ క్షేత్రంలో సాగు చేస్తున్న ద్రాక్షపై ఎకరాకు రూ.20వేలకు మించి ఆదాయం వచ్చే అవకాశం లేదని ఆదాయ పన్ను డిప్యూటీ కమిషనర్ నివేదికలో వెల్లడించారు. 4.86 ఎకరాల్లో మాత్రమే ద్రాక్ష ఉందని, మిగిలిన భూమిలో కొబ్బరి, కూరగాయలు సాగు చేశారని గమనించినట్లు చెప్పారు.
దీన్ని బట్టి చూస్తే జయలలిత చెప్పిన ఆదాయం తప్పని న్యాయస్థానం అభిప్రాయపడింది. కాగా, ఈ క్షేత్రం ద్వారా వచ్చిన ఆదాయానికి సంబంధించి జయలలిత ఎలాంటి ఆధారాలు చూపలేదు. రికార్డులు కూడా నిర్వహించలేదు. అంచనా ప్రకారమే ఈ మొత్తాన్ని చూపారని జడ్జి అభిప్రాయపడ్డారు. మొత్తంగా చూసినట్లయితే జయలలిత కేసులో హైదరాబాద్లో ఆమెకున్న ద్రాక్ష తోట కూడా కీలకమైనట్లు అర్థమవుతోంది.












Click it and Unblock the Notifications