ఆర్ కే నగర్ లో శశికళకు సెగ: ఎందులో అమ్మకు వారుసురాలివి ?
జయలలిత ప్రాతినిధ్యం వహించిన చెన్నైలోని ఆర్ కే నగర్ శాసన సభ నియోజక వర్గంలో పోటీ చెయ్యడానికి సిద్దం అవుతున్న నెచ్చెలి శశికళకు స్థానిక అన్నాడీఎంకే కార్యకర్తలు పెద్ద షాక్ ఇచ్చారు.
చెన్నై: జయలలిత ప్రాతినిధ్యం వహించిన చెన్నైలోని ఆర్ కే నగర్ శాసన సభ నియోజక వర్గంలో పోటీ చెయ్యడానికి సిద్దం అవుతున్న నెచ్చెలి శశికళకు స్థానిక అన్నాడీఎంకే కార్యకర్తలు పెద్ద షాక్ ఇచ్చారు. చిన్నమ్మ మీరు ఇంత వరకు చేసింది చాలు, దయచేసి ఇక్కడి నుంచి పోటీ చెయ్యరాదని పెద్ద ఎత్తున ఫ్లక్సీలు ఏర్పాటు చేశారు.
ఇప్పుడు శశికళకు వ్యతిరేకంగా ఆర్ కే నగర్ లో ఏర్పాటు చేసిన ఫ్లక్సీలు, బ్యానర్లు ఉద్రిక్తతలను సృష్టిస్తున్నాయి. అన్నాడీఎంకే అధినేత్రి, దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణం తరువాత ఖాళీ అయిన ఆర్ కే నగర్ నుంచి పోటీ చెయ్యాలని శశికళకు అన్నాడీఎంకే నాయకులు మనవి చేస్తున్నారు.
ఆర్ కే నగర్ నుంచి పోటీ చెయ్యాలని అన్నాడీఎంకేకీ చెందిన పలువురు నేతలు, పార్టీ అనుభంద సంస్థలు, మంత్రులు ఇప్పటికే శశికళ కాళ్ల మీద పడి జయలలిత ప్రాతినిధ్యం వహించిన నియోజక వర్గం నుంచి మీరే పోటీ చెయ్యాలని మనవి చేశారు.
ఈ సందర్బంలో ఆర్ కే నగర్ నియోజక వర్గంలో శశికళకు వ్యతిరేకంగా ఫ్లక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. ఆ బ్యానర్లు, ఫ్లక్సీలల్లో రాసిన విషయాలు ఇలా ఉన్నాయి. జయలలిత రాజకీయ వారసురాలిగా డబ్బు, హోదా ఆశిస్తున్న శశికళకు అమ్మ మరణంపై వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలని లేదా అని ప్రశ్నించారు.
ఆర్ కే నగర్ తో పాటుతమిళనాడు ప్రజల ఆగ్రహానికి శశికళ గురికాక తప్పుదు అనే వ్యాఖ్యలు రాశారు. విషయం గుర్తించిన అన్నాడీఎంకే నాయకులు ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. కొందరు కావాలనే ఇలా రెచ్చగొట్టే వ్యాఖ్యాలు చేశారని శశికళ వర్గీయులు ఆరోపిస్తున్నారు.