జయలలితకు నాలుగేళ్లు జైలు: వంద కోట్ల జరిమానా
బెంగళూరు:అక్రమాస్తుల కేసులో దోషిగా తేలిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు బెంగళూర్ ప్రత్యేక కోర్టు నాలుగేళ్లు జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. ఈ నేపథ్యంలో ఆమె తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనున్నారు. శనివారం మధ్యాహ్నం ఆమెను దోషిగా తేల్చిన కోర్టు సాయంత్రం శిక్షను ఖరారు చేసింది. తాను అనారోగ్యంతో బాధపడుతున్నందున తనకు శిక్షను తగ్గించాలని ఆమె కోర్టును అభ్యర్థించారు. కోర్టు తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో ఆమె మధ్యాహ్నం భోజనం కూడా చేయలేదు.
జయలలితతో పాటు శశికళ, సుధాకరన్, ఇళవరసన్లకు కూడా కోర్టు నాలుగేళ్ల చొప్పున జైలు శిక్ష విధించింది. వారికి భారీ జరిమానాను కూడా విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. జయలలితకు వంద కోట్ల రూపాయల జరిమానాను విధించగా, మిగతా ముగ్గురికి పది కోట్ల రూపాయల చోప్పున జరిమానా విధించింది.
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను ఆస్తుల కేసులో శనివారం బెంగళూర్ ఆగ్రహార ప్రత్యేక కోర్టు దోషిగా తేల్చింది. సిబిఐ వాదనతో కోర్టు అంగీకరించింది. ఈ నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కోర్టు తీర్పు నేపథ్యంలో అన్నాడియంకె కార్యకర్తల్లో నైరాశ్యం నెలకొంది. కర్ణాటక, తమిళనాడు సరిహద్దుల్లో భారీగా భద్రతా బలగాలను మోహరించారు. ఈ నేపథ్యంలో డిఎంకె అధినేత కరుణానిధి పార్టీ నేతలతో సమావేశమయ్యారు. అన్నాడియంకె నేతలు అక్కడికి చేరుకుని జయలలితకు మద్దతుగా నినాదాలు చేస్తూ కనిపించారు. దీంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. శశికళ ప్రియసఖి శశికళ, పెంపుడు కుమారుడు సుధాకరన్, బంధువు ఇలవరసిలను కూడా కోర్టు కేసులో దోషులుగా తేల్చింది.
అయితే, కోర్టు ఇంకా శిక్షను ఖరారు చేయలేదని సమాచారం. తమిళనాడుకు చెందిన మంత్రులు, న్యాయవాదులు ఇంకా కోర్టులోనే ఉన్నారు. వారు బయటకు వస్తే తప్ప అసలు విషయం తెలియదని అంటున్నారు. 1996లో సుబ్రహ్మణ్య స్వామి ఈ కేసు వేశారు. బెంగళూర్లోని కోర్టుకు కేసు తర్వాత బదిలీ అయింది.
అంతకు ముందు దాదాపు 18 ఏళ్ల సుదీర్ఘ న్యాయపోరాటం తరువాత తన భవితవ్యం తేల్చే కేసు తీర్పు వెలువడనున్న నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి, ఎఐఎడిఎంకె అధినేత్రి జె.జయలలిత శనివారంనాడు బెంగళూర్ చేరుకున్నారు. జయలలిత, మరో ముగ్గురిపై ఆదాయానికి మించి ఆస్తులున్నట్టు దాఖలయిన కేసులో ప్రత్యేక కోర్టు శనివారం ఇక్కడ తన తీర్పును వెలువరించింది.

జయలలిత మొదటిసారి ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు 1991-96 మధ్య కాలంలో తన ఆదాయానికి మించి రూ. 66కోట్ల ఆస్తులను కూడబెట్టినట్టు అభియోగాలు నమోదయిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ కేసు వల్ల రాజకీయంగా, న్యాయపరంగా అనేక అనూహ్య మలుపులు చోటుచేసుకున్నాయి. జయలలితకు సన్నిహితురాలయిన శశికళ నటరాజన్, ఆమె మేనకోడలు ఇల్లవరసి, ఆమె మేనల్లుడు, జయలలిత దత్త పుత్రుడు సుధాకరన్ తదితరులు నిందితులుగా ఉన్నారు.

బెంగళూరుకు సమీపంలోని పరప్పణ అగ్రహారం జైలు ఆవరణలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కోర్టులో ప్రత్యేక న్యాయమూర్తి జాన్ మిఖాయెల్ డి కున్హా ఈ కేసులో తీర్పు ఇచ్చారు. ముఖ్యమంత్రి జయలలిత నిందితురాలిగా ఉన్న ఈ కేసులో తీర్పు వెలువరించే క్రమంలో కోర్టు ఆవరణ, పరిసరాల్లో అయిదంచెల భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
వందలాది మంది పోలీసు సిబ్బందితో పాటు కర్నాటక రాష్ట్ర రిజర్వ్ పోలీస్, సిటీ ఆర్మ్డ్ రిజర్వ్, రాపిడ్ యాక్షన్ ఫోర్స్కు చెందిన బలగాలను కోర్టు ఆవరణ, పరిసరాల్లో మోహరించారు. ఈ కేసు తుది తీర్పును వాయదా వేయాలన్న జయలలిత అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది.












Click it and Unblock the Notifications