స్పృహలోనే అమ్మ: ఎంజీఆర్ లాగే, జయ కోసం చెన్నైకి మోడీ
చెన్నై: తమిళనాడుకు తాత్కాలిక ముఖ్యమంత్రిని నియమించాల్సిన అవసరం లేదని అన్నాడీఎంకే అధికార ప్రతినిధి అవది కుమార్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన సీఎం జయలలిత త్వరలోనే కోలుకుంటారని పేర్కొన్నారు.
గతంలో న్యాయపరమైన చిక్కులు తలెత్తినప్పుడు మాత్రమే ఆర్థిక మంత్రి పన్నీర్ సెల్వం సీఎంగా బాధ్యతలు చేపట్టారని, ప్రస్తుతం అటువంటి పరిస్థితి ఏమీ లేదని అన్నారు. అంతేకాదు 'అమ్మ' స్పృహలోనే ఉన్నారని, త్వరలోనే కోలుకుంటారని ఆయన వ్యాఖ్యానించారు.
కాగా, 1984లో అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు ఎంజీ రామచంద్రన్ అనారోగ్యంతో అమెరికాలో చికిత్స పొందుతూనే ఇక్కడ వ్యవహారాలను చక్కదిద్ది ఎన్నికల్లో విజయం సాధించారని, అమెరికా నుంచి తిరిగి వచ్చిన తరువాత ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారని అవది కుమార్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.

ఇక గతంలో డీఎంకే నేత మురసోలి మారన్ అనారోగ్యంతో మంచం పట్టారని, ఎలాంటి శాఖ కేటాయించకపోయినా చనిపోయేంత వరకూ ఆయన కేంద్రమంత్రిగా కొనసాగారని వివరించారు. ఇదిలా ఉంటే 17 రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పటికీ తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం ఇంకా మెరుగుపడలేదు.
చికిత్సకు ఆమె శరీరం సహకరిస్తోందన్న వార్తలు వస్తున్నాయే కానీ... లోపల ఏం జరుగుతోందో కూడా ఎవరికీ అర్థం కావడం లేదు. జయలలితకు ట్రీట్ మెంట్ జరుగుతున్న గదిలోకి ఎవరినీ అనుమతించడం లేదు. ఈ నేపథ్యంలో పన్నీరు సెల్వంను డిప్యూటీ సీఎంగా నియమిస్తారంటూ వార్తలు వస్తున్నాయి.
ఈ వ్యవహారానికి సంబంధించి తమిళనాడు ఇన్ ఛార్జ్ గవర్నర్ విద్యాసాగర్ రావుతో ఆ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ రామ్మోహన్ రావు భేటీ అయ్యారు. రాష్ట్ర పాలనా వ్యవహారాలను గవర్నర్కు వివరించారు. మరోవైపు జయలలిత ఆరోగ్య పరిస్థితిపై ప్రధాని మంత్రి కార్యాలయం ఆరా తీసింది.
ప్రధాని మోడీ ఒకటి రెండు రోజుల్లో జయలలితను పరామర్శించే అవకాశం ఉంది. ప్రధాని పర్యటనకు భద్రత కల్పించాలంటూ తమిళనాడు సర్కార్ను పీఎంవో ఆదేశించినట్లు వార్తలు వస్తున్నాయి.












Click it and Unblock the Notifications