ఆ తర్వాతే జయ ఆరోగ్యంపై దెబ్బ: అదే చివరిసారి
అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్లిన తర్వాతనే ఆమె ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. శాసనసభ ఎన్నికలకు ముందే ఆమె చికిత్స కోసం విదేశాలకు వెళ్తారనే ప్రచారం జరిగింది. కానీ అలా జరగలేదు.
చెన్నై: అక్రమాస్తుల కేసులో 2014 సెప్టెంబర్లో ఆమె జైలుకు వెళ్లారు. ఆ తర్వాతే ఆమె ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తూ వచ్చింది. ఇండియన్ ఎక్స్ప్రెస్ కథనం ప్రకారం - కర్ణాటకలో జైలుకు వెళ్లిన తర్వాత ఆమె ఆరోగ్యం వేగంగా క్షీణిస్తూ వచ్చింది.
ఆమె వ్యక్తిగత జీవిత అత్యంత గోప్యమైంది. ఆమె ఆరోగ్యం ఏ మేరకు క్షీణించిందనే విషయం బయటి ప్రపంచానికి ఏ మాత్రం తెలియదు. జైలు నుంచి విడుదలైన తర్వాత రాజకీయ ప్రత్యర్థులు గుర్తించి, ఆమెను లక్ష్యం చేసుకోవడం ప్రారంభించారు.
ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టిన తర్వాత ఆమె కొన్ని కీలకమైన బాధ్యతలకు దూరంగా ఉంటూ వచ్చారు. మాజీ ప్రదాన కార్యదర్శి షీలా బాలకృష్ణనన్ వంటి కీలకమైన విశ్వాసపాత్రులు వ్యవహారాలను నడిపిస్తూ వచ్చారు.
ఆమెకు నాల్గు గంటలు పట్టింది.
గత ఎన్నికల సమయంలో ఫోర్ట్ సెయింట్ జార్జ్ పర్యటన నుంచి అకస్మాత్తుగా వెనుదిరిగారు. ఆ తర్వాత బయటకు వెళ్లడానికి దాదాపు నాలుగు గంటల సమయం పట్టిందని అంటున్నారు. 2015లో ఆరోగ్యం క్షీణించిన తర్వాత ఆమె సెక్యూరిటీ ప్రోటోకాల్లో మార్పు చేశారు.
ఆమె సెక్యూరిటీ ప్రోటోకాల్లో మార్పులు
అక్రమాస్తుల కేసులో ఆమె దోషిగా తేలడానికి ముందు ఆమెకు, సెక్యూరిటీ అధికారులకు మధ్య రెండు అడుగుల దూరం ఉంటూ వచ్చింది. జైలుకు వెళ్లిన తర్వాత దాన్ని ఒక్క అడుగుకు తగ్గించారు.
ఆమె నిలబడలేకపోయారు..
గత రెండేళ్లుగా ఎక్కువ సేపు నిలబడడానికి కూడా జయలలితకు కష్టంగా మారింది. బహిరంగ సభల వేదికల మీదకు చేరుకోవడానికి ఎలివేటర్స్ వాడుతూ వచ్చారు. కూర్చునే ప్రసంగాలు చేస్తూ వచ్చారు.
ఆ తర్వాత పూర్తిగా మారిపోయారు..
2014లో జైలుకు వెళ్లిన తర్వాత ఆమె వైద్యులను చూడడానికి కూడా నిరాకరించారని, తాను వాడుతున్న మందుల గురించి నాయకులకు, అధికారులకు చెప్పడానికి కూడా ఆమె ఇష్టపడలేదని చెబుతారు. జైలు నుంచి విడుదలైన తర్వాత జయలలిత పూర్తిగా మారిపోయినట్లు కనిపించారని, బైయిల్ గానీ కేసు నుంచి విముక్తి గానీ ఆమెకు ఏ మాత్రం సంతోషాన్నివ్వలేదని చెబుతారు.
ప్రజల ముందుకు అదే చివరిసారి..
జయలలిత చివరి సారి 2016 సెప్టెంబర్ 20వ తేదీన ప్రజల ముందుకు వచ్చారు. ఆ తర్వాత రెండు రోజులకే ఆమె ఆస్పత్రిలో చేరారు . ఆ రోజు జయలలిత చెన్నై విమానాశ్రయం మెట్రో స్టేషన్ కొత్త లైన్ ప్రాంరభోత్సవ కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, రాధాకృష్ణన్లతో పాటు పాల్గొన్నారు. అప్పటికే జయలలిత ఆరోగ్యం క్షీణించిందని, ఆమెను వీల్ చైర్లో కార్యాలయానికి తీసుకుని వచ్చారని చెబుతారు. ఆ తర్వాత రెండు రోజులకే అపోలోలో చేరారు. ఆ తర్వాత ఆమె బయటకు రాలేదు.