జయలలితను పరామర్శించనున్న మోడీ: పార్టీ ఒక్కటిగా ఉండేనా?
చెన్నై: అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను ప్రధాని నరేంద్ర మోడీ రేపు పరామర్శించవచ్చునని అంటున్నారు. ఆయన గోవా వెళ్లనున్నారు. చెన్నై మీదుగా ఆమెను పరామర్శిస్తూ వెళ్లవచ్చునని అంటున్నారు.
ఎయిమ్స్ వైద్యుడి రాక
జయలలితకు అందిస్తున్న చికిత్స విధానాన్ని పర్యవేక్షించడానికి గురువారం మరోసారి ఢిల్లీ నుంచి ఎయిమ్స్ వైద్యుడు ఖిల్నానీ వచ్చారు. ఆయన ఊపిరితిత్తుల వ్యాధి నిపుణులు. జయలలితకు ఆస్తమా ఉండటం, ఊపిరితిత్తుల్లో నిమ్ము చేరడంతో అందుకు చికిత్స చేస్తున్న అపోలో ప్రత్యేక వైద్యబృందానికి డాక్టర్ ఖిల్నానీ తగిన సలహాలు, సూచనలు ఇస్తున్నారు.
మరోవైపు లండన్ వైద్యుడు రిచర్డ్ బాలే చెన్నైలోనే మకాం వేసి జయలలిత ఆరోగ్యాన్ని సమీక్షిస్తున్నారు. డా ప్రతాప్ సిరెడ్డి ఆసుపత్రిలోనే ఉండి ఆమె ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. పార్టీ అధికార ప్రతినిధి సరస్వతి మాట్లాడుతూ.. జయలలిత త్వరగా కోలుకుని, తిరిగి పాలనాబాధ్యతలు చేపడతారన్నారు.
అన్నాడీఎంకే ఒక్కటిగా ఉండేనా?
జయలలిత ఆసుపత్రిలో ఉన్న నేపథ్యంలో అన్నాడీఎంకే పార్టీలో అందరూ ఒక్కటిగా ఉండేనా అనే చర్చ జోరుగా సాగుతోంది. పార్టీలో జయ ఏం చెబితే అదే. ఆమె మాట జవదాటే వారు లేరు. అలాంటిది ఇప్పుడు ఆమె ఆసుపత్రిలో ఉండటంతో.. పార్టీలో ఏమైనా ఇబ్బందులు వస్తాయా అనే చర్చ సాగుతోంది.