జయలలితపై పుకార్లు, 7గురి అరెస్ట్: అపోలోలోకి నకిలీ పోలీస్ కారు!
చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం పైన పుకార్లు సృష్టించిన ఘటనలో అరెస్టైన వారి సంఖ్య ఏడుకు చేరింది. సోషల్ మీడియాలో జయ ఆరోగ్యం పైన కొందరు రూమర్స్ సృష్టిస్తున్నారు. వీరి పైన కన్నేసిన పోలీసులు.. ఇప్పటి దాకా 9 మందిని అరెస్టు చేసింది.
జయలలిత ఆరోగ్యం పైన సోషల్ మీడియాలో పుకార్లు సృష్టించిన ఓ వ్యక్తిని శనివారం నాడు పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఏడుకు చేరింది. అలాగే, కేసుల సంఖ్య 50 వరకు ఉన్నాయి. టుటికోరిన్ జిల్లాకు చెందిన 24 ఏళ్ల ఆంటోనీ జేసురాజ్ను పోలీసులు అరెస్టు చేశారు.
సోషల్ మమీడియాలో ఆంటోనీ జేసురాజ్ పుకార్లు సృష్టిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, దీంతో తాము అతనిని అరెస్టు చేశామని పోలీసులు చెప్పారు. అన్నాడీఎంకే ఐటీ వింగ్ నేత ఎస్ చంద్రు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా చెప్పారు. ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్, వాట్సాప్ ద్వారా.. ఎలా రూమర్స్ సృష్టించిన అరెస్ట్ చేస్తున్నారు.
అపోలోలోకి నకిలీ పోలీసు కారు!
చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జయలలితను చూసేందుకు అత్యుత్సాహం కనబరచిన ఓ మాజీ డీఎస్పీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అపోలో ఆస్పత్రి వద్ద పోలీసులు నిత్యం భద్రత కల్పిస్తున్నారు. అనుమానిత వాహనాలను గ్రీమ్స్రోడ్లోనే ఆపేసి, క్షుణ్నంగా తనిఖీ చేశాకే ఆస్పత్రి ఉన్న మార్గంలోకి అనుమతిస్తున్నారు.
దారిపొడవునా పోలీసులు కాపలా కాస్తున్నా శుక్రవారం రాత్రి పోలీస్ స్టిక్కర్తో ఉన్న ఓ కారు వేగంగా అపోలో లోపలికి వెళ్లింది. ఎవరో పోలీసు ఉన్నతాధికారి అని అంతా భావించారు. అందులోంచి దిగిన వ్యక్తి ఎటు వెళ్లాలో తెలియక తికమకపడుతూ మెట్ల వైపుగా వెళుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఆయన.. తాను జయలలితను చూసేందుకు వెళ్తున్నానని, అడ్డుకోవద్దని కేకలు వేశాడు. విచారణలో సదరు వ్యక్తి రిటైర్డ్ డీఎస్పీ తిరునావుక్కరసుగా తెలిసింది. ఆయనను థౌజండ్ లైట్స్ పోలీసులు విచారిస్తున్నారు.
లండన్ వైద్యుడి చికిత్స
జయకు లండన్ వైద్యుడు రిచర్డ్ బాలే, ఎయిమ్స్ వైద్యులు ఖిల్నానీ, నితీష్లు కొనసాగిస్తున్నారు. జయలలితను సీటీ స్కానింగ్ కోసం కింది అంతస్తుకు తీసుకొస్తున్నట్లు శనివారం మధ్యాహ్నం ప్రచారం జరిగింది. అయితే అందులో ఎలాంటి నిజం లేదని అంటున్నారు. జయలలిత ఆరోగ్య పరిస్థితిపై శనివారం హెల్త్ బులెటిన్ విడుదల చేస్తారని అన్నాడీఎంకే వర్గాలు ఎదురుచూశాయి. జయకు స్వస్థత చేకూరాలంటూ అన్నాడీఎంకే నేతలు, కార్యకర్తలు, జయ అభిమానులు పూజలు కొనసాగించారు.