ఆఫీసుల్లో జయలలిత ఫొటోలు: వివరణ కోరిన కోర్టు
మదురై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు సంబంధించిన ఫొటోలు, పేర్లు ప్రభుత్వ కార్యాలయాల్లో కనిపించడంపై శుక్రవారం మద్రాసు హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. పిటిషన్పై వివరణ ఇవ్వాలని తమిళనాడు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శిని కోర్టు ఆదేశించింది.
అంతేగాక, ప్రభుత్వ కార్యాలయాలు, పథకాల నుంచి జయలలిత ఫొటోలను, పేర్లను వెంటనే తొలగించాలని దాఖలైన పిటిషన్పై మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ శుక్రవారం విచారించింది. మదురై బార్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ ఎస్ కరునానిధి వేసిన పిటిషన్ను విచారించిన జస్టిస్ వి ధనపాళన్తో కూడిన ధర్మాసనం.. దీనిపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వ చీఫ్ సెక్రటరీని ఆదేశించింది.
నిబంధనల ప్రకారం.. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ ఆధీనంలోని సంస్థలు, కార్పొరేషన్లు మొదలైన వాటిలో ప్రస్తుతం ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి ఫొటోలు మాత్రమే ఉండాలి. అయితే అందుకు విరుద్ధంగా ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయి బెయిలుపై విడుదలైన మాజీ ముఖ్యమంత్రి ఫొటోలను పెట్టడంపై వల్లే పిటిషన్ వేసినట్లు పిటిషనర్ పేర్కొన్నారు.
ప్రభుత్వం అధికారులు ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న జయలలిత ఫొటోలను గానీ, ఆమె పేరును గానీ రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో, పథకాల్లో గానీ ఉపయోగించకూడదని పిటిషనర్ తెలిపారు.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దోషిగా తేలడంతో ముఖ్యమంత్రి పదవికి జయలలిత రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత తమిళనాడు ముఖ్యమంత్రిగా పన్నీరు సెల్వం ప్రమాణ స్వీకారం చేశారు.