వామ్మో శశికళ: ‘ఆయా నుంచి అన్నాడీఎంకే’చీఫ్ అయ్యారు
చెన్నై: అన్నాడీఎంకే పార్టీ పగ్గాలు చేతపట్టుకున్న నెచ్చెలి శశికళ ఇప్పుడు నాయకులు, కార్యకర్తలను ముందుకు నడిపించే సత్తా ఉందా ? అని అందరూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆమెకు ఇంత వరకు ఎలాంటి రాజకీయ అనుభవం లేదు.
శశికళ 10వ తరగతి వరకు చదువుకున్నారు. శశికళ భర్త నటరాజన్ జిల్లా కలెక్టర్ అయిన ఐఏఎస్ అధికారి చంద్రలేఖ దగ్గర పీఆర్ ఓగా పని చేసేవారు. ఆ సమయంలో శశికళ సొంతంగా వీడియో క్యాసెట్ల షాప్ పెట్టుకున్నారు. అయితే షాప్ అంతగా జరగకపోవడంతో ఆమె నష్టాలను చవిచూశారు.
ఓ రోజు నటరాజన్ తన భార్య శశికళ గురించి కలెకట్టర్ చంద్రలేఖ దగ్గర చెప్పారు. అదే సమయంలో చంద్రలేఖకు జన్మించిన బిడ్డను చూసుకోవడానికి ఒక ఆయా కావాలని నటరాజన్ తెలుసుకున్నారు.
ఎలాగైనా శశికళను తెచ్చి చంద్రలేఖ దగ్గర ఆయాగా పనిలో పెట్టాలని నటరాజన్ నిర్ణయించారు.

తన భార్య మీ బిడ్డను జాగ్రత్తగా చూసుకుంటుందని నటరాజన్ చెప్పడంతో కలెక్టర్ చంద్రలేఖ శశికళను ఆయాగా పెట్టుకున్నారు. ఆయాగా పని చెయ్యవలసిన అవసరం లేకపోయినా పెద్దలు పరిచయం అవుతారని శశికళ ఆ పనిలో చేరారు.
అప్పుడు ఐఏఎస్ అధికారి అయిన చంద్రకళ వీడియో క్యాసెట్ల షాప్ పెట్టుకుంటే ఎలాంటి ఫలితం ఉండదని, వీడియో కవరేజ్ చేస్తే డబ్బుకు డబ్బు, పేరుకు పేరు వస్తుందని శశికళకు సూచించారు.
ఆ సమయంలో అన్నాడీఎంకే పార్టీ కార్యదర్శి అయిన జయలలిత మీద ఎంజీఆర్ కు మంచి గురి ఉండేది. శాసన సభ ఎన్నికల ప్రచార బాధ్యతలు స్వీకరించి రాష్ట్రం మొత్తం తిరిగి ప్రచారం చెయ్యాలని ఎంజీఆర్ జయలలితకు సూచించారు.
ఎన్నికల ప్రచారం చేస్తున్న సమయంలో జయలితను కలెక్టర్ చంద్రలేఖ కలిశారు. తాను ఎన్నికల ప్రచారం చేసే సమయంలో వీడియో చిత్రీకరించడానికి మంచి వ్యక్తి కావాలని, తెలిసిన వారు ఉంటే చెప్పాలని చంద్రలేఖకు జయలలిత చెప్పారు.

అప్పుడు కలెక్టర్ చంద్రలేఖ శశికళను పిలిపించి జయలితకు పరిచయం చేశారు. జయలలిత ఎన్నికల ప్రచారం సందర్బంగా ఆమెతో పాటు శశికళ రాష్ట్రం అంతా తిరిగారు. అలా జయలలిత, శశికళ ఇద్దరూ దగ్గర అయ్యారు.
ఒకరి కష్టాలు ఒకరు చెప్పుకున్నారు. ఎంజీఆర్ ముఖ్యమంత్రి అయిన తరువాత ఎంపీ అయిన జయలలిత దగ్గరే ఉంటున్న శశికళ అన్ని తానై చూసుకున్నారు. ఎంజీఆర్ వర్గీయులు జయలలితను దూరం చేసిన తరువాత ఆమెకు శశికళ అండగా ఉన్నారు.
1991లో జయలలిత సీఎం అయిన తరువాత అన్నాడీఎంకే పార్టీలో శశికళకు ప్రాధాన్యత ఎక్కువ అయ్యింది. 1995లో శశికళ సోదరుడి కుమారుడు సుధాకరన్ ను జయలలిత దత్తత తీసుకున్నారు. అదే సంవత్సరం సెప్టెంబర్ నెలలో బహుబాష నటుడు శివాజీ గణేషన్ మనుమరాలు సత్యలక్ష్మితో తన దత్త పుత్రుడు సుధాకరన్ వివాహం ఘనంగా జరిపించారు. ఆ పెళ్లి తరువాత జయలలితకు కష్టాలు మొదలైనాయి.
అప్పటి నుంచి జయలలిత దగ్గరే ఉంటున్న శశికళ తెరవెనుక అన్నీ తానై నడిపించారు. తన బంధు వర్గాన్ని రాజకీయాల్లోకి తీసుకువచ్చారు. జయలలితకు 2011లో దూరం అయిన శశికళ నాలుగు నెలలు తిరగకుండానే మళ్లీ అమ్మకు దగ్గర అయ్యారు.
జయలలిత మరణించే వరకు ఆమె పక్కనే ఉన్నారు. ఇప్పుడు అన్నాడీఎంకే పార్టీ పగ్గాలు తీసుకునే స్థాయికి వచ్చారు. అమ్మ లేని లోటును శశికళ పూర్తి చేస్తారా ? అంటే సమాధానం చిక్కడం లేదు. ఆయా స్థాయి నుంచి అన్నాడీఎంకే చీఫ్ వరకు శశికళ ప్రయాణం ఇలా సాగింది.












Click it and Unblock the Notifications