రోశయ్యతో జయ భేటీ: రేపు 11 గంటలకు ప్రమాణస్వీకారం, కవితకు ఆహ్వానం
చెన్నై: తమిళనాడు సీఎం పన్నీర్ సెల్వం శుక్రవారం ఉదయం తన పదవికి రాజీనామా చేశారు. గవర్నర్ రోశయ్యను ఈరోజు ఉదయం కలసి పన్నీర్ సెల్వం తన రాజీనామా లేఖను అందజేశారు. పన్నీర్ సెల్వం రాజీనామాను గవర్నర్ ఆమోదించారు.
దీంతో అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మళ్లీ సీఎం అయ్యేందుకు అన్ని ఏర్పాట్లు చకచక జరిగిపోతున్నాయి. శుక్రవారం ఉదయం అన్నాడీఎంకే శాసనసభా పక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు మళ్లీ తమ నేతగా జయలలితను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
చెన్నైలో జరిగిన శాసనసభా పక్ష సమావేశం అన్నాడీఎంకేకు చెందిన 144 మంది శాసనసభ్యులు పాల్గొన్నారు. విజయ్ కాంత్ డీఎండీకే పార్టీకి చెందిన ఐదుగురు రెబల్ ఎమ్మెల్యేలు కూడా పాల్గొనడం విశేషం. శాసనసభా పక్ష సమావేశం అనంతరం ఎమ్మెల్యే సెల్లూర్ కే రాజు మాట్లాడుతూ తన జీవితంలో ఇది ఎంతో సంతోషకరమైన రోజుగా అభివర్ణించారు.
జయలలితఈ రోజు మధ్యాహ్నం ఒంటిగంటకు తమిళనాడు గవర్నర్ రోశయ్యను కలవనున్నారు. తనని శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్న విషయాన్ని ఆయనకు లాంఛనంగా చెప్పనున్నారు. శనివారం జయలలిత తమిళనాడు ముఖ్యమంత్రిగా మరోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
సీఎంగా జయలలిత ప్రమాణ స్వీకారానికి భారీ ఎత్తున ఆ పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి. గతేడాది సెప్టెంబర్లో జయలలిత అవినీతి ఆరోపణల కేసులో దోషిగా తేలడంతో తన పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత ఆమె స్ధానంలో విధేయుడు ఓ పన్నీర్ సెల్వంను సీఎంగా జయలలిత నియమించారు.
మే 11న కర్ణాటక హైకోర్టు తీర్పుతో జయలలిత నిర్దోషిగా బయట పడ్డారు. దీంతో మళ్లీ మరోసారి తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత శనివారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
జయలలితకు ఫోన్లో కేసీఆర్ అభినందన
అన్నాడీఎంకే అధినేత జయలలితకు తెలంగాణ సీఎం కేసీఆర్ అభినందనలు తెలిపారు. అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా ఆమె శుక్రవారం మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కేసీఆర్ శుక్రవారం ఉదయం ఫోన్లో జయను అభినందించారు. కాగా, జయలలిత ప్రమాణ స్వీకారానికి ఎంపీ కల్వకుంట్ల కవితకు ఆహ్వానం అందింది. ఆమె శనివార ఉదయం చెన్నై వెళ్లనున్నారు.
గవర్నర్ రోశయ్యను కలిసిన జయలలిత, ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధత
అన్నాడీఏంకే శాసనసభాపక్ష నేతగా శుక్రవారం తిరిగి ఎన్నికైన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మధ్యాహ్నం రాజ్భవన్లో గవర్నర్ రోశయ్యతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తన నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్కు సంసిద్ధత తెలిపారు. తన కేబినేట్లో కొలువుతీరనున్న మంత్రుల జాబితాను జయలలిత గవర్నర్కు అందజేశారు.
8 నెలల తర్వాత పోయెస్ గార్డెన్స్ నుంచి బయటకు వచ్చిన ఆమె, ముందుగా ఎంజీ రామచంద్రన్ విగ్రహం వద్ద నివాళులర్పించి.. ఆ తర్వాత గవర్నర్ నివాసమైన రాజ్ భవన్ కు వెళ్లారు.
శనివారం ఉదయం 11 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నట్లు రోశయ్యకు తెలిపారు. ఈ సందర్భంగా జయలలిత బయటకు రాగానే ఒక్కసారిగా అభిమానులంతా.. 'అమ్మ తిరిగొచ్చింది' అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు.