జయలలిత కేసు అక్టోబర్ లో విచారణ
న్యూఢిల్లీ: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అక్రమ ఆస్తుల కేసుపై విచారణ సుప్రీం కోర్టులో అక్టోబర్ నెలలో విచారణ జరగనుంది. కర్ణాటక ప్రభుత్వం, డీఎంకే పార్టీ నాయకుడు అన్బళగన్ కర్ణాటక హై కోర్టు ఇచ్చిన తీర్పును ప్రశ్నిస్తూ సుప్రీం కోర్టులో అప్పీలు చేశారు.
అర్జీ విచారణ చేసిన సుప్రీం కోర్టు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితతో పాటు ఆమె సన్నిహితురాలు శశికళ నటరాజన్, ఇళవరసి, సుధాకరన్ లకు నోటీసులు జారీ చేసింది. సమాధానం చెప్పడానికి సుప్రీం కోర్టు వీరికి నాలుగు వారాల గడువు ఇచ్చింది.
అదే సమయంలో కర్ణాటక హై కోర్టు ఇచ్చిన తీర్పుకు స్టే ఇవ్వడానికి వీలుకాదని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. జయలలితతో సహా మిగిలిన నలుగురు సమాధానం ఇచ్చిన తరువాత సుప్రీం కోర్టు అర్జీ విచారణ చేపడుతుంది. తరువాత కర్ణాటక ప్రభుత్వం, అన్బళగన్ అభ్యంతరాలు వ్యక్తం చేయ్యడానికి అవకాశం ఉంటుంది.
అక్రమ ఆస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న జయలలిత నిర్దోషి అని కర్ణాటక హై కోర్టు న్యాయమూర్తి సి.ఆర్. కుమారస్వామి 2015 మే 11వ తేది తీర్పు చెప్పారు. తరువాత జయలలిత మే 23వ తేదిన తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యారు.
అయితే కర్ణాటక హై కోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చెయ్యాలని కర్ణాటక ప్రభుత్వం తన అర్జీలో మనవి చేసింది. అందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. కర్ణాటక హై కోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేస్తే అంతకు ముందు సీబీఐ కోర్టు విధించిన నాలుగు సంవత్సరాల జైలు శిక్ష అమలు చెయ్యవలసి వస్తుంది.