శశికళకు మరో షాక్: జయ చిన్ననాటి స్నేహితుల మద్దతు పన్నీర్కే
స్నేహితులెవరూ జయలలితను కలవకుండా వారందరిని శశికళ దూరం చేశారని జయ చిన్ననాటి స్నేహితులు వాపోయారు.
చెన్నై: వరుసబెట్టి తగులుతున్న షాక్లు అన్నాడీఎంకె ప్రధాన కార్యదర్శి శశికళను రోజురోజుకు సందిగ్దంలోకి నెట్టేస్తున్నాయి. తాజాగా అమ్మ జయలలిత చిన్ననాటి స్నేహితులు సైతం తమ మద్దతు పన్నీర్ సెల్వంకే అని ప్రకటించారు.
జయలలిత చిన్ననాటి స్నేహితురాలు శ్రీమతి అయ్యంగార్, చాందిని పంకజ్ బులానీ తమిళనాట చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలపై తాజాగా మీడియాతో మాట్లాడారు. శశికళ పట్ల వ్యతిరేకత వ్యక్తం చేస్తూ.. ఆమె వల్లే జయలలితకు చిన్ననాటి స్నేహితులు దూరమయ్యారని పంకజ్ బులానీ ఆరోపించడం గమనార్హం.

పంకజ్ బులానీ ప్రస్తుతం బెంగుళూరులో నివసిస్తున్నారు. ఈ సందర్బంగా ఆమె గతాన్ని గుర్తుచేసుకున్నారు. తాను డెలివరీ అయినప్పుడు జయలలిత ఆసుపత్రికి వచ్చి పరామర్శించారని, అయితే ఆ తర్వాత పరిస్థితులు మారిపోయాయని అన్నారు. కనీసం జయలలితను చూసే అవకాశం కూడా ఇవ్వలేదని ఆరోపించారు.
జయలలితను కలిసేందుకు అప్పట్లో ఓసారి పన్నీర్ సెల్వం అపాయింట్ మెంట్ ఇప్పించినా, కావాలని కొంతమంది దాన్ని అడ్డుకున్నారని చెప్పారు. స్నేహితులెవరూ జయలలితను కలవకుండా వారందరిని శశికళ దూరం చేశారని అన్నారు. పన్నీర్ సెల్వం చాలా మంచి వ్యక్తి అని, చివరిసారి తామంతా కలిసి భోజనం చేసినప్పుడు ఆయన కూడా అక్కడే ఉన్నారని పేర్కొన్నారు.
అమ్మకు అత్యంత విశ్వాసపాత్రుడు కావడం వల్లే పన్నీర్ సెల్వంను ఆమె రెండుసార్లు సీఎం చేశారని శ్రీమతి అయ్యంగార్ అన్నారు. అన్నాడీఎంకెలో ఏర్పడ్డ పరిస్థితులు బాధాకరమని అన్నారు. ఏదేమైనా జయలలిత చిన్ననాటి స్నేహితుల మద్దతు పన్నీర్ సెల్వంకు మరింత ఆదరణ పెంచేదిగా మారింది.












Click it and Unblock the Notifications