జయ! ఆస్పత్రిలో 74 రోజులు: ఏం జరిగింది? వైద్య ప్రకటనలు ఇలా
చెన్నై: అన్నాడీఎంకే అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్య సమస్యల కారణంగా సెప్టెంబర్ 22 నుంచీ.. చెన్నై అపోలో ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. కాగా, ఆదివారం సాయంత్రం ఆమెకు ఆకస్మాత్తుగా గుండెపోటు వచ్చినట్లు వైద్యులు వెల్లడించారు. దీంతో వెంటనే ఆమెను ఐసీయూలో చేర్చి ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు.
లండన్ వైద్యుడు రిచర్డ్ బేలే సలహాలు, సూచనలతో టెలి కాన్ఫరెన్స్ ద్వారా ఎయిమ్స్ వైద్య బృందంతో పాటు అపోలో వైద్యులు జయకు చికిత్స చేస్తున్నారు. కాగా, అపోలో ఆస్పత్రిలో జయ చేరి సోమవారం(డిసెంబర్ 5)నాటికి 74 రోజులు అవుతోంది.
తీవ్ర జ్వరం, ఊపిరితిత్తుల వ్యాధితో బాధ పడుతున్న జయ రెండు వారాల క్రితం పూర్తి స్థాయిలో కోలుకున్నదని చెన్నై అపోలో ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. జయ పూర్తిగా కోలుకున్నదని.. ఎప్పుడైనా ఆమె ఇంటికి వెళ్లొచ్చని ఆదివారం మధ్యాహ్నం ఆస్పత్రి వర్గాలు ప్రకటన చేశాయి.
కాగా, గంటల వ్యవధిలోనే సాయంత్రం 4.30 గంటలకు గుండెపోటు వచ్చినట్లు వైద్యులు వెల్లడించారు. దీంతో అన్నాడీఎంకే కార్యకర్తలు, అభిమానుల్లో ఆందోళన నెలకొంది. అమ్మ అభిమానులు ఆస్పత్రి వద్దకు భారీగా చేరుకుని కన్నీరు పెట్టుకుంటున్నారు. జయ త్వరగా కోలుకోవాలని అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా పూజలు, యాగాలు,ప్రార్థనలు చేస్తున్నారు.
జయలలిత అపోలో ఆస్పత్రిలో చేరిన తర్వాత వైద్య ఏం జరిగింది..

సెప్టెంబర్ 22-29
సెప్టెంబర్ 22 : తీవ్ర జ్వరం, డీహైడ్రేషన్, శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతూ సీఎం జయలలిత చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరారు.
సెప్టెంబర్ 24 : జయ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యుల ప్రకటన
సెప్టెంబర్ 29 : జయ వైద్యానికి స్పందిస్తున్నారు, సాధారణ ఆహారం తీసుకుంటున్నారు, మరిన్ని రోజులు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని ప్రకటన

అక్టోబర్ 1-6
అక్టోబర్ 1: జయ చనిపోయిందన్న వార్తలను ఖండించిన అన్నాడీఏంకే. జయలలిత ఆరోగ్యంగా ఉన్నారని, త్వరలోనే పరిపాలన కార్యక్రమాలు చేపడుతారని ప్రకటన.
అక్టోబర్ 2 : లండన్ వైద్యుడు రిచర్డ్ బేలే వైద్య బృందం ఆధ్వర్యంలో జయకు చికిత్స. శ్వాసకోశకు సంబంధించి చికిత్స చేసిన వైద్య బృందం.
అక్టోబర్ 6 : మిగతా వైద్య చికిత్సల కోసం ఎయిమ్స్ నుంచి ప్రత్యేక బృందం అపోలో ఆస్పత్రికి రాక.

నవంబర్ 3-19
నవంబర్ 3 : జయలలిత పూర్తి స్థాయిలో కోలుకున్నారని అపోలో ఆస్పత్రి ప్రకటన
నవంబర్ 13 : త్వరలోనే ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటానని జయ ప్రెస్నోట్ విడుదల
నవంబర్ 19: ఐసీయూ నుంచి సాధారణ గదికి జయ మార్పు

డిసెంబర్ 4-5
డిసెంబర్ 4(మధ్యాహ్నం) : జయలలిత త్వరలోనే ఇంటికి వస్తారు.. అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారని ప్రకటన.
డిసెంబర్ 4(సాయంత్రం) : జయకు తీవ్రమైన గుండెపోటు.. ఐసీయూలో చికిత్స అందిస్తున్నామని అపోలో ఆస్పత్రి ప్రకటన.
డిసెంబర్ 5: జయలలిత ఆరోగ్య పరిస్థితి తీవ్ర విషమంగా ఉంది. వైద్యులు తమ శాయశక్తులా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. చివరకు సోమవారం రాత్రి మరణించినట్లు ప్రకటన.












Click it and Unblock the Notifications