ఇద్దరు జేడీఎస్ ఎమ్మెల్యేలు మాయం, 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డుమ్మా, ఏం జరుగుతోంది!
బెంగళూరు: కర్ణాటక రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. బుధవారం బెంగళూరు నగరంలో బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల శాసన సభ్యుల సమావేశాలు వారివారి పార్టీల కార్యాలయాల్లో నిర్వహించారు. బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ పార్టీ శాసన సభ్యులు అందరూ ఆయా పార్టీల కార్యాలయాల్లో హాజరుకావాలని నాయకులు ఆదేశాలు జారీ చేశారు. అయితే కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలకు చెందిన శాసన సభ్యులు మాయం కావడంతో ఆ పార్టీల నాయకుల్లో ఆందోళన మొదలైయ్యింది. జేడీఎస్ కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల ఆచూకికోసం ఆ పార్టీ నేతలు ఆరా తీస్తున్నారు. కాంగ్రెస్ కు చెందిన 12 మంది ఎమ్మెల్యేలు సమావేశానికి హాజరుకాలేదు.
జేడీఎస్ ఎమ్మెల్యేలు
బుధవారం ఉదయం 10.50 గంటల సమయంలో జేడీఎస్ పార్టీ ఎమ్మెల్యేల సమావేశం ప్రారంభం అయ్యింది. జేడీఎస్ పార్టీ టిక్కెట్ తో గెలిచిన ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి హాజరైనారు. హెచ్.డి. కుమారస్వామిని శాసన సభా పక్షనేతగా ఏకగ్రీవంగా ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు.
ఇద్దరు మాయం
జేడీఎస్ పార్టీ ఎమ్మెల్యేల సమావేశం జరుగుతున్నా ఆపార్టీకి చెందిన ఎమ్మెల్యేలు రాజా వెంకటప్ప నాయక్, వెంకట రావ్ నదగుంద మాత్రం హాజరుకాలేదు. ఇద్దరు ఎమ్మెల్యే ఆచూకి లేకపోవడంతో హెచ్.డి. కుమారస్వామిలో టెన్షన్ మొదలైయ్యింది.
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డుమ్మా
కాంగ్రెస్ పార్టీకి 78 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బుధవారం ఉదయం బెంగళూరులోని క్వీన్స్ రోడ్డులోని కేపీసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి 66 మంది ఎమ్మెల్యేలు మాత్రమే హాజరైనారు.
12 మంది ఎమ్మెల్యేలు
కాంగ్రెస్ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలు వివిద కారాణాల వలన శాసన సభాపక్ష సమావేశానికి హాజరుకాలేదని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సమావేశానికి హాజరుకాకపోవడంతో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఎమ్మెల్యేలు ఎక్కడ
కాంగ్రెస్ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలు, జేడీఎస్ కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఎక్కడ ఉన్నారు అని ఆ పార్టీల నాయకులు ఆరా తీస్తున్నారు. బీఎస్. యడ్యూరప్ప బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడానికి చకచకా పనులు మొదలు పెట్టడంతో కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలకు ఇప్పటికే గాలం వేశారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.